టీఆర్ఎస్కు బండి సంజయ్ వార్నింగ్: రైతులను నట్టేట ముంచారంటూ ఫైర్, అంబానీ అప్పుడు లేరా?
కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ఒక్క మంత్రి కూడా ఇంటి నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. జగిత్యాలలో తన పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ యత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి దాడులు తప్పవంటూ బండి హెచ్చరిక
ఎవరు దాడి చేసినా పక్కాగా దాడి చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేతోపాటు పలువురు నేతలు ఆందోళన నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నేతలను అక్కడ్నుంచి పంపించాలని పోలీసులను బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ వచ్చే సమయానికి పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అక్కడ్నుంచి పంపించారు. దీంతో బండి సంజయ్ పర్యటన సజావుగా కొనసాగింది.
రైతులను నట్టేట ముంచి.. మేలు చేసే చట్టాలను వ్యతిరికేస్తారా?
జగిత్యాలలో పర్యటించిన బండి సంజయ్.. రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవడ్లు పండించాలని చెప్పి రైతులను సీఎం కేసీఆర్ నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. నూతన వ్యవసాయ చట్టాలను రైతులంతా స్వాగిస్తున్నారని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కారణాలతో రైతుల్లో అయోమయం సృష్టిస్తున్నారని బండి మండిపడ్డారు. ఏ కారణం లేకుండా కొత్త వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేంత వరకు బీజేపీ పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
మోడీకి పేరొస్తుందనే భయమన్న రఘునందన్ రావు
ఇది ఇలావుండగా, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మరో వేదికగా మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోడీకి మాత్రమే పేరొస్తుందనే భయంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కాలం చెల్లిన, బూజు పట్టిన చట్టాలను తొలగించి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకువస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు కొత్త చట్టాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయన్నారు.
అంబానీ, అదానీలు 2014కి ముందు లేరా?
బహిరంగ మార్కెట్లో అందరూ తమకు నచ్చిన ధరలకు అమ్ముకుంటుంటే.. రైతులకు మాత్రమే ఎందుకు నిబంధనలు ఉండాలన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఉండే ఓపెన్ మార్కెట్ సిస్టంను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజలకు లాభం చేకూర్చేలా చట్టాలను సవరించి తీసుకువస్తామన్నారు. ఆ విధంగా తెచ్చినవే ఈ మూడు వ్యవసాయ చట్టాలన్నారు.
పార్లమెంటులో అందరితో చర్చించిన తర్వాతే.. ఈ నూతన చట్టాలను తీసుకువచ్చామన్నారు. అంబానీ, అదానీలు ఇప్పుడే ఢిల్లీకి వచ్చారా? 2014 మే 26కు ముందు లేరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమన్నారు.