మీడియాకు దిమ్మతిరిగే ప్రశ్న వేసిన బండ్ల గణేష్ : గొడ్డలి తీసుకుని కేసీఆర్ ఇంటికి వెళ్లారా?
అతను ఓ కమెడియన్... ఒకప్పుడు చాలా సినిమాల్లోనే నటించారు... ఆ తర్వాత కాలం కలిసొచ్చి అవే సినిమాలను తీయడం మొదలెట్టారు. డబ్బులు కూడా సిపిమాల ద్వారా బాగా సంపాదించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది స్టోరీ. ఇక రాజకీయాల్లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రంలో రాహుల్కు జైకొట్టాడు. రాష్ట్రంలో ఉత్తమ్కుమార్ రెడ్డే తమ కెప్టెన్ అన్నాడు. ఇలా తెలంగాణలో ఎన్నికలకు ముందు రోజుకో టీవీఛానెల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరగడం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పడంతో తెలుగురాష్ట్రాల్లో ఆయన పేరు ట్రెండ్ అయ్యింది... కాదు..కాదు మాటలతో ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. ఇక ఆయన పలికిన ప్రగల్భాలు అంతా ఇంతా కాదు.. ఆయన ఆవేశంతో ఊగిపోయి చేసే సవాళ్లు అయితే ఇక కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లుగా అనిపించేది. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్టే... ఆయనే ప్రముఖ కమెడియన్ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.
వైరల్ అయిన బండ్ల గణేష్ ఛాలెంజ్
బండ్ల గణేష్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. కారణం సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూలు ట్రెండ్ అవుతుండటమే. బండ్ల గణేష్ పై చిన్న ప్రోమో వదలితే చాలు... ఇక ఆ యూట్యూబ్ ఛానెల్ హిట్ అయినట్లే.. అంతలా ఫేమస్ అయ్యాడు. యాక్టర్గా కన్నా పొలిటీషియన్గానే ప్రజల నోళ్లలో బండ్ల గణేష్ పేరు నానుతోంది. కమెడియన్గా ఆయన సినిమా కెరీర్ ఎలా అయితే ప్రారంభమైందో పొలిటికల్ కెరీర్లో కూడా కమెడియన్గానే మిగిలిపోతున్నారు బండ్ల గణేష్. ఇందుకు తాజాగా ఆయన చేసిన సవాలే కారణం. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్తో తన గొంతు కోసుకుంటానని... ఆరోజున బ్లేడు కూడా తీసుకురావాలని ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు బండ్ల గణేష్. ఇక ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయ ఢంకా మోగించింది. బండ్ల గణేష్ ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల వరకు కనిపించకుండా పోయారు. బండ్ల గణేష్ ఇంటర్వ్యూ తీసుకున్న రిపోర్టర్ బ్లేడు పట్టుకుని బండ్ల గణేష్ ఇంటికి కూడా వెళ్లాడు. అక్కడ ఆయన లేడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా.
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాటతప్పారు..ప్రశ్నించే దమ్ముందా..?
స్వామివారిని దర్శించుకునేందుకు తిరుపతిలో ప్రత్యక్షమైన బండ్ల గణేష్ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కోపంలో కోటలు దాటే మాటలు మాట్లాడుతుంటాం.. అంతమాత్రాన అన్ని చేస్తామా ఏంటీ అంటూ ఎదురు ప్రశ్న వేశారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మరో ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... పెద్ద పెద్ద మహానుభావులే మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఒక దళితుడే ఉంటాడని... లేదంటే తల నరుక్కుంటానన్న మాటలను బండ్ల గణేష్ గుర్తు చేశారు. మరి మాటతప్పిన కేసీఆర్ దగ్గరకు ఒక్క జర్నలిస్టు కూడా వెళ్లి ఎందుకు అడగరు అని ఎదురు ప్రశ్న వేశారు. దేశ ప్రధాని మోడీ కూడా పెద్దనోట్ల రద్దు వల్ల మంచి ఫలితాలు వస్తాయని 50 రోజుల్లో నిరూపించకపోతే తనను ఉరితీయాల్సిందిగా అన్నారని మరి ఇప్పటి వరకు దానికి దిక్కులేదన్న బండ్ల గణేష్... ప్రధాని మోడీని ఈ విషయంపై జర్నలిస్టులు ఎందుకు ప్రశ్నించరని అడిగారు.
మీడియాపై గౌరవం పోయింది
ఎన్నికల్లో టీఆర్ఎస్లాంటి పార్టీని ఢీకొడుతున్నప్పుడు కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం నింపేందుకే ఆ మాటలు తాన మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు బండ్ల గణేష్. ఇక ఆ మాటలను పట్టుకుని ఓ ఛానెల్ రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడని ధ్వజమెత్తారు బండ్ల గణేష్. కేవలం యూట్యూబ్ హిట్ల కోసం ఇలా దిగజారడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నాయకులే తనను ఏమీ అనడం లేదని ఇక వీళ్లంతా తనను ప్రశ్నించడం మానవత్వం అనిపించుకోదని చెప్పారు. కేసీఆర్ను ప్రశ్నించే దమ్ముందా అని ప్రశ్నించారు..జర్నలిజం పక్కదోవ పడుతోందని అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారం చూసి తన కుటుంబంతో పాటు బంధువులు కూడా వేదన చెందారని ఆవేదన చెందారు బండ్ల గణేష్. జర్నలిస్టులన్నా మీడియా అన్నా తనకు గౌరవం పోయిందన్నారు.