బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!
హుజూర్ నగర్: ప్రముఖ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో చెప్పారు. అంతేకాదు, లక్ష ఓట్ల మెజార్టీతో ఆయనను గెలిపిస్తే, తెలంగాణ సారథిగా తిరిగి వస్తారని చెప్పారు.
ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. అయితే ఆయన ప్రజలను ఆకట్టుకోవడానికి చేశారా లేక పార్టీలో కీలక నేత కాబట్టి గెలిస్తే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఏం మాట్లాడారంటే..
సోనియా గాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల హుజూర్ నగర్ నియోజకవర్గం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని బండ్ల గణేష్ తెలిపారు. ఉత్తమ్ ఆశీస్సులతో ఈ నియోజకవర్గం భవిష్యత్తు అద్బుతంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తమ పార్టీ నాయకురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేసారు.
సోనియా తెలంగాణ ఇస్తే ఇంటికెళ్లి ఫోటోలు దిగారు
సోనియా తెలంగాణ ఇస్తే ఇంటిల్లిపాది ఆమె ఇంటికి పోయి, కాళ్లు మొక్కి ఫోటోలు తీసుకొని, ఇప్పుడు మాత్రం ఆమె ఏం చేయలేదని, కాంగ్రెస్ ఏం చేయలేదని చెబుతున్నారని కేసీఆర్ను ఉద్దేశించి బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే, ఆయనను అసెంబ్లీకి పంపిస్తే.. ఆయన తెలంగాణ రాష్ట్రానికి సారథిగా మళ్లీ మీ వద్దకు తిరిగి వస్తాడని చెప్పారు.
ఓ ముఖ్యమంత్రిని పంపించిన చరిత్ర మీకు ఉంటుంది
మీ జీవితాలు అన్నీ మారిపోతాయని బండ్ల గణేష్ తెలిపారు. తెలంగాణ అద్భుతంగా ప్రగతిపథంలోకి దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఓ కీర్తి ఉంటుందని, ఒక ముఖ్యమంత్రిని పంపించిన ఘనత మీకు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దని, ఇది చరిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించారు. మీ ఓటు ద్వారా ఉత్తమ్పై ప్రేమను పంచుకోవాలన్నారు. జై కాంగ్రెస్, ఉత్తమ్ నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై సోనియమ్మ అని నినాదాలు చేశారు.
కేసీఆర్పై ఉత్తమ్ నిప్పులు
శనివారం ఉత్తమ్ మట్టపల్లిలో నృసింహునికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో ఉత్తమ్తో పాటు బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ ఓట్లడిగేందుకు వస్తున్నారనన్నారు. కూటమి అధికారంలోకి రానుందని, డిసెంబర్ 12 తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కాంగ్రస్దే అన్నారు. కాగా, పలువురు తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.