బండ్ల గణేష్ : కాంగ్రెస్ నేత కామెడీ నేతగా మారిన వేళ...
బండ్ల గణేష్... గత రెండు మూడేళ్లుగా బాగా వినపడుతున్న పేరు. కామెడీ నటుడిగా సినిమా పరిశ్రమకు ఎంటరై ఆ తర్వాత బడా నిర్మాతల లిస్టులో చేరిపోయిన వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఓ రేంజ్ ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ నిలిచారు. అనంతరం పలు సినిమాలు నిర్మించారు. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ వచ్చిన బండ్ల గణేష్... తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ టికెట్ ఆశిస్తున్నారు బండ్ల గణేష్.
రాజేంద్రనగర్ టికెట్ ఆశిస్తున్న బండ్ల గణేష్
బండ్ల గణేష్ రాజేంద్ర నగర్ టికెట్ పై కన్నేశారు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ విడుదల చేసిన రెండు జాబితాల్లో ఆయన పేరు కనిపించలేదు. ఇక మూడో జాబితాపైనే బండ్ల గణేష్ ఆశపెట్టుకున్నారు. తనకు తప్పకుండా టికెట్ వస్తుందని చెబుతూనే... రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకునే వ్యక్తిని తానని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ ఏది దాచుకోకుండా అన్ని ప్రశ్నలకు టకాటకామని సమాధానం చెబుతారు. అంతేకాదు ఆయన చెప్పే కొన్ని సమాధానాలు వింటే ముందుగానే ప్రిపేర్ అయి వచ్చారా అన్నట్లుగా ఉంటుంది. అయితే తను చెప్పే సమాధానంలో మాత్రం రాజకీయంగా మెచ్యూరిటీ కనిపించదు. ఏదో మాట్లాడుకోవడానికి బాగుంటుంది తప్పితే అవేవీ సాధ్యం కావు అన్నట్లుగా ఉంటాయి. అందుకే బండ్ల గణేష్ ఇంటర్వ్యూ వస్తుందంటే వీక్షకులు టీవీలకు అతుక్కుపోతారు.
రాజేంద్రనగర్ కాంగ్రెస్ టికెట్ రేసులో కార్తీక్ రెడ్డి
తాజాగా రాజేంద్రనగర్ టికెట్ ఆశిస్తున్న బండ్ల గణేష్కు భంగపాటు తప్పదనే వార్తలు వస్తున్నాయి. అదే స్థానం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిని బరిలోకి నిలపాలని ఢిల్లీ కేంద్రంగా సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబానికి ఒకే టికెట్ మాటకు కట్టుబడితే కార్తీక్ రెడ్డికి టికెట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఒక స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇదే కనుక జరిగితే బండ్ల గణేష్కు లైన్ క్లియర్ అవుతుందనే భావించాలి. ఇక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన గణేష్ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా అని ప్రజలు వేచిచూస్తున్నారని గణేష్ చెప్పారు.
నా జెండా అజెండా కాంగ్రెస్
లేటుగా వచ్చిన లేటెస్ట్గా బరిలో నిలిచి విజయం సాధించి కప్పు గెలుచుకుంటామని చెప్పారు. ఇప్పటికే కూటమికి అధికారం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని జోస్యం చెప్పారు బండ్ల గణేష్. తనకు పవన్ కళ్యాణ్ దైవసమానులు, తన గురువు బొత్స సత్యనారాయణ అని చెప్పిన బండ్ల గణేష్... వారు ఇతర పార్టీలకు చెందినవారైనప్పటికీ తన జెండా అజెండా కాంగ్రెస్ అని చెప్పారు. ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత చంద్రబాబుని గౌరవించడంలో తప్పేముందని ప్రశ్నించారు.
కేసీఆర్ హామీలపై సెటైర్ల వర్షం
ఇంటర్వ్యూలో మొత్తం కేసీఆర్ పై బండ్ల గణేష్ సెటైర్ల వర్షం కురిపించారు. కేసీఆర్ అన్నీ చెప్పారని అయితే తామే సరిగ్గా అర్థం చేసుకోలేదని బండ్ల గణేష్ చెబుతూ ఇందుకు కొన్నిటిని ఉదహరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లే అని కేసీఆర్ అన్నారని ... ఇల్లే అంటే లేదని అర్థం వస్తుందని చెప్పారు. నల్లా తిప్పితే నీళ్లే అన్నారని.. నిల్ లే... అంటే నీళ్లు ఇవ్వరని దానర్థమని అది కూడా తప్పుగా అర్థం చేసుకున్నట్లు బండ్ల గణేష్ తనదైన శైలిలో కామెడీ పండించారు. లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ చెప్పడంలో తప్పులేదని... లక్ష రూపాయలు కడితే ఉద్యోగం వస్తుందని ఆయన కరెక్టుగానే చెప్పారని తెలంగాణ ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పి కేసీఆర్ రాజీ అయ్యారని అందుకే ఆయన్ను డిసెంబర్ 11వ తేదన ప్రజలు మాజీ చేస్తారని చెప్పి నవ్వులు పూయించారు.
రాజకీయంగా డబ్బు సంపాదిస్తే బండ్ల గణేష్ చనిపోయినట్లే..!
ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క గుంట కనపడితే తనకు చెప్పాలని కేటీఆర్ చెప్పారని అలా చెప్పిన వారికి రూ.1000 బహుమానం ఇస్తామని నాడు ఎన్నికల సందర్భంగా చెప్పారని గుర్తుచేసిన బండ్ల గణేష్... ఈ విషయం మోడీకి తెలిసి దేశంలోని అన్ని వెయ్యి రూపాయల నోట్లు హైదరాబాద్కే వెళతాయని భావించి వెంటనే నోట్లు రద్దు చేశారని చెప్పి బండ్ల గణేష్ హాస్యం పండించారు. తన టికెట్ అప్లికేషన్ తమ కెప్టెన్ ఉత్తమ్కుమార్ రెడ్డికి ఇచ్చానని అధిష్టానం కనికరిస్తే టికెట్ వస్తుంది లేదంటే కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తానని బండ్ల గణేష్ చెప్పారు. ఒకవేళ టికెట్ వచ్చి ఎమ్మెల్యే అయితే ప్రజాసేవతో పాటు సినిమాలు తీస్తానని అది తన జీవనోపాధి అని చెప్పారు. ప్రజాసేవ వేరు సినిమాలు వేరు అని చెప్పారు. రాజకీయం ద్వారా ఏనాడైతే తను డబ్బు సంపాదిస్తానో ఆనాడు నిజంగానే తను చనిపోయినట్లు అని ఇది ప్రజలముందు ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు.