అందమైన ఫొటో.. దొంగ ప్రొఫైల్.. 2600 మందికి గాలం వేసిన మాయ‘లేడీ’
ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో అందమైన ఫొటోతో దొంగ ఫ్రొఫైల్ సృష్టించుకుని దేశ వ్యాప్తంగా 2600 మంది యువకులకు గాలం వేసిన ఓ మాయ‘లేడీ’ఎట్టకేలకు పట్టుబడింది.
హైదరాబాద్: అందమైన ఫొటో, దొంగ ప్రొఫైల్.. వీటి ఆధారంగా మాట్రిమోనియన్ సైట్లలో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం.. ఆకర్షితులైన యువతులను నిలువునా ముంచడం.. ఇలాంటి మోసాలు చేసి, ఏదో ఒక రోజు పాపం పండి.. పోలీసులు చేతికి చిక్కి కటకటాలపాలైన యువకులను మనం ఇప్పటి వరకు చూసుంటాం.
కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బెంగళూరుకు చెందిన ఓ మాయ'లేడీ' ఇదే పంథా అనుసరిస్తూ నమ్మిన యువకులను నట్టేట ముంచింది. దేశ వ్యాప్తంగా ఈ యువతి 2600 మందికి గాలం వేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ మాయలేడి చేతిలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు కూడా మోసపోయారు. వారిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తానికి ఈ మోసగత్తెను బుధవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన శ్రీలత ఇంటర్నెట్ నుంచి ఓ అందమైన యువతి ఫొటోను డౌన్లోడ్ చేసుకుని, తన పేరును సుస్మితగా పేర్కొంటూ ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ లో తన వివరాలు రిజిస్టర్ చేసుకుంది.
ఈమె ప్రొఫైల్ వివరాలు చూస్తే.. హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల యువతిగా కనిపిస్తుంది. తన పేరు సుస్మిత అని, తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని, నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తోందని పేర్కొంది.
ఫొటో చూసి 'అబ్బో అందగత్తే..'అనుకున్న వారికి ప్రొఫైల్ వివరాలు చూడగానే దిమ్మతిరిగిపోతుంది. ఇంకేముంది దేశవ్యాప్తంగా 2600 మంది యువకులు ఈమె ప్రొఫైల్ ను లైక్ చేయడంతోపాటుగా వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చారు.
ఇలా ఆకర్షితులైన యువకుల్లో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. సిటీకి చెందిన ఓ యువకుడితో కొన్ని రోజుల పాటు 'సుస్మిత'గా ఫోన్ లో మాట్లాడిన శ్రీలత ఆమెపై నమ్మకం కలిగేలా చేసుకుంది. హఠాత్తుగా ఒకరోజు తాను పర్సు పోగొట్టుకున్నానంటూ చెప్పి, అర్జెంటుగా రూ.40 వేలు కావాలని ఫోన్ లో అడిగింది.
అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన సదరు యువకుడు ఆ మేరకు నగదును ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు. మళ్లీ కొన్ని రోజులకు మళ్లీ డబ్బు అడగడంతో అనుమానం వచ్చిన అతను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి తన అనుమానాలు వెలిబుచ్చాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు డబ్బు డిపాజిట్ అయిన బ్యాంకు ఖాతాను స్తంభింప జేశారు. ఆ ఖాతా శ్రీలత సోదరుడిది. దీంతో ఖంగుతిన్న అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తన ఖాతా ఫ్రీజ్ అయిందని, డీ-ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరాడు.
దీంతో హైదరాబాద్ యువకుడితో మాట్లాడటానికి సుస్మిత ఉపయోగించిన ఫోన్ నంబర్ ను అతడికి చూపించి ఆరా తీయగా, అది తన సోదరి శ్రీలతకు చెందిన మొబైల్ నంబర్ అంటూ అతడు తన అక్క ఫొటో కూడా పోలీసులకు చూపించాడు. ఆ ఫొటో చూసిన నగర బాధితుడు ఒకింత షాక్ కు గురయ్యాడు.
ఇదిలా ఉండగా.. నగరానికి చెందిన మరో 'సుస్మిత'బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇతడిది మరో కథ. కొంతకాలం అతడితో మాట్లాడి చనువు పెంచుకున్న శ్రీలత.. ఉన్నట్లుండి ఒకరోజు తన సమీప బంధువు మరణించాడని, డబ్బు అవసరం ఉందంటూ రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయంచుకుందనేది ఇతడి ఫిర్యాదు.
ఈ రెండు కేసుల నునమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మాయ'లేడీ' అంతు చూడమంటూ బెంగళూరుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. మాట్రిమోనియల్ సైట్ లో సుస్మితగా చెలామణీ అవుతున్న శ్రీలతను వారు బుధవారం అక్కడ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించడంతో మొత్తం కథ బయటికొచ్చింది.
సదరు మాట్రిమోనియల్ వెబ్ సైట్ లోని శ్రీలత తప్పుడు ప్రొఫైల్ ద్వారా 2600 మంది ఆకర్షితులు కావడంతో వారిలో ఇంకెందరు బాధితులు ఉన్నారనేదానిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.