హైదరాబాద్కు మనుషుల్ని తినే క్యాట్ఫిష్లు!: ఎయిర్పోర్ట్లో సీజ్, ఏం జరుగుతోంది?
హైదరాబాద్: నగరంలో అతి ప్రమాదకరమైన క్యాట్ఫిష్ల వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో సుమారు 44 నిషేధిత క్యాట్ఫిష్లను కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం గమనార్హం.
దేశంలో నిషేధితమైన వీటిని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దిగుమతి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి కావడం చర్చనీయాంశంగా మారింది. కార్గోలో అట్టపెట్టెల్లో తీసుకొచ్చిన వీటిని కర్ణాటకకు తరలిస్తున్నారని ప్రాథమికంగా నిర్ధరించినా.. ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై పోలీసులకు ఇంకా స్పష్టమైన సమాచారం లభించలేదు.
బీదర్కా.. హైదరాబాద్కేనా?
కాగా, కార్గో విమానాశ్రయానికి చేరుకోకముందే విషయం బయటికి పొక్కి అధికార యంత్రాంగాలు అప్రమత్తం కావడంతో సరకు తీసుకోవాల్సిన నిందితులు కాస్త జారుకోవడం గమనార్హం. బీదర్కు తరలించేందుకే వీటిని హైదరాబాద్కు తీసుకొచ్చారని కొంతమేర సమాచారం అందినా.. హైదరాబాద్కే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇది పూర్తి మాంసాహారి
అతి ప్రమాదకరమైన, నిషేధం ఉన్న క్యాట్ఫిష్ మనదేశంలోకి ఎవరు, ఎవరి కోసం తీసుకొస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, క్యాట్ఫిష్ చేప జాతిలో ఒకటే అయినా మిగతా చేపలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా చేపలు నీటిలోని నాచు, గడ్డిని తిని బతుకుతాయి. కానీ, క్యాట్ఫిష్ పూర్తిగా మాంసాహారి.
మిగితా చేపలను బతకనివ్వవు
ఆఫ్రికన్ క్యాట్ఫిష్గా పిలుచుకునే దీనికి కోళ్ల వ్యర్థాలే ఆహారం. కోడి కాళ్లు, చర్మం, తల.. తదితర వ్యర్థాలను తింటుంది. అంతేగాక, ఇది ఎక్కడి నీళ్లలో ఉంటే అక్కడి మిగతా చేపల్ని పూర్తిగా తినేస్తుంది. ఒక ప్రాంతంలో పది క్యాట్ఫిష్లను వేస్తే ఏడాది తిరిగేసరికల్లా లక్ష క్యాట్ఫిష్లుగా రూపాంతరం చెందుతాయి. క్యాట్ ఫిష్ చేపల వృద్ధి మిగితా చేపల మనుగడకు ముప్పుగా పరిణమించినందువల్లే భారత ప్రభుత్వం దేశంలో వీటి పెంపకాన్ని నిషేధించింది.
మనషులను కూడా చంపి తినేస్తాయి
మరోవైపు వీటి పెంపకం కోసం చేపట్టే చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తున్న కారణంగా భూగర్భజలాలు కలుషితమై పర్యావరణానికి ముప్పు కలుగుతోంది. దీనికితోడు కొన్ని క్యాట్ఫిష్లు 20 కిలోల వరకు పెరుగుతాయి. ఇలాంటివి ఉన్న నీటిలో పొరపాటున మనుషులు పడినా సులభంగా చంపి తినేస్తాయి. అంతటి భయంకరమైనవి కావడం వల్లే వీటి పెంపకంపై మన దేశంలో నిషేధం అమల్లో ఉంది.
పెద్దగా ఖర్చు లేకుండానే వృద్ధి
అయితే, క్యాట్ఫిష్పై నిషేధం ఉన్నా దొంగచాటుగా దిగుమతి చేస్తూ పలు ప్రాంతాల్లోని చెరువుల్లో రహస్యంగా పెంపకాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విమానంలో దిగుమతి చేస్తూ పోలీసులకు చిక్కడం గమనార్హం. చికెన్ విక్రయాల సందర్భంగా పారబోసే వ్యర్థాలతోనే క్యాట్ఫిష్ను వృద్ధి చేయవచ్చు. దీంతో పెద్దగా ఖర్చులు కూడా ఉండవు. అందుకే అక్రమంగానైనా వీటిని పెంచేందుకు కొన్ని ముఠాలు మొగ్గు చూపుతున్నట్లు మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు.
తక్కువ ధరకే అమ్మి ఎక్కువ లాభం
అంతేగాక, సాధారణంగా మంచిరకం చేపలు కిలోకు రూ.200-600 వరకు దొరుకుతాయి. అవే క్యాట్ఫిష్ అయితే కేవలం రూ.60-90కే దొరికే అవకాశముంటుంది. అక్రమార్కులు వీటిని కొనుగోలు చేసి మంచిరకం చేపల కింద విక్రయించి సొమ్ము చేసుకుంటుంటాయి. అందుకే ఈ అక్రమాన్ని రుచిమరిగిన స్మగ్లింగ్ ముఠాలు లాభాలే పరమావధిగా వీటి పెంపకం వైపు మొగ్గు చూపుతున్నాయని మత్య్సశాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. వీటిపై మత్స్యశాఖ అధికారులతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.