దుబ్బాక అభ్యర్థి కత్తి కార్తీకకు షాక్.. చీటింగ్ కేసు నమోదు... ఆ వివాదమే కారణం...?
ప్రముఖ టీవీ యాంకర్,వ్యాపారవేత్త,ప్రస్తుత దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థి కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. వేరొకరి భూమిని తమదిగా పేర్కొంటూ ఓ వ్యాపారవేత్తకు దాన్ని విక్రయించ చూశారన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తికతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. దుబ్బాక ఉపఎన్నికలో కత్తి కార్తిక బరిలో ఉన్నవేళ ఆమెపై కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని టచ్స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ దొరస్వామి టీమ్వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ శ్రీధర్ గోపిశెట్టితో 20 ఏళ్ల పరిచయం ఉంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ శివారులో భూమి కొనుగోలు చేయాలని భావించిన దొరస్వామి... ఇదే విషయాన్ని శ్రీధర్తో చెప్పారు. దీంతో కత్తి కార్తీక ఆధ్వర్యంలో నడుస్తున్న కార్తీక గ్రూపును సంప్రదిస్తే పని సులువవుతుందని శ్రీధర్ సలహా ఇచ్చాడు. ఇందుకు దొరస్వామి కూడా ఒప్పుకోవడంతో శ్రీధర్ కార్తీకను సంప్రదించాడు.
అమీన్పూర్లో ఆ స్థల తమదని...
కార్తీకకు విషయం చెప్పడంతో హైదరాబాద్ శివారులో తాను భూమి ఇప్పిస్తానని రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో కత్తి కార్తీకతో పాటు నువ్వాల శివరాం,తెన్నేరి భీమ్సేన్ తదితరులు దొరస్వామిని కలిశారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో సర్వే నంబర్లు 322,323,324,329లలో దాదాపు 52 ఎకరాల ఖాళీ స్థలం ఉందని... ఇందులో తమకు కూడా కొంత వాటా ఉందని దొరస్వామితో చెప్పారు. తమకు చెందిన భూమిని రూ.35 కోట్లకు విక్రయిస్తామని చెప్పారు. భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయన్నారు.
అసలు విషయం తెలిసి షాక్...
ఆ మాటలు నమ్మి దొరస్వామి కత్తి కార్తికతో పాటు ఆమె సూచించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో రూ.1కోటి డబ్బును జమచేశారు. కానీ ఆ తర్వాత దొరస్వామికి అసలు విషయం తెలిసింది. ఆ స్థలం సిస్లా రమేష్ అనే వ్యక్తిది అని తెలుసుకున్న దొరస్వామి అతన్ని సంప్రదించాడు. ఆ స్థలంపై సర్వ హక్కులు తమవేనని రమేష్ చెప్పడంతో షాక్ తిన్నాడు. కత్తి కార్తీకకు గాని మరొకరికి గాని ఆ స్థలంతో సంబంధం లేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన దొరస్వామి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన కత్తి కార్తీక,శ్రీధర్ గోపిశెట్టి,నువ్వాల శివారం ప్రసాద్,అందె మురళీకృష్ణ,భీమ్ సేన్ తదితరులపై ఫిర్యాదు చేశాడు.
Recommended Video
కార్తీకపై కేసు నమోదు..
దొరస్వామి ఫిర్యాదు మేరకు కార్తికతో పాటు మిగిలిన ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 406,420,120(బి)ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుపై కత్తి కార్తీక ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీవీ వ్యాఖ్యాత అయిన కార్తిక సొంతంగా ఇంటిరీయర్ బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు.