కావూరికి ఝలక్: రూ.1000 కోట్లు చెల్లించాలని బ్యాంక్ అధికారుల నిరసన
హైదారాబాద్: మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు బ్యాంకులకు చెల్లించాల్సిన దాదాపు రూ.1000 కోట్లు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఆయన కార్యాలయం ఎదుట బ్యాంకర్లు సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. కావూరికి చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ బ్యాంకులకు పెద్ద మొత్తంలో డబ్బులు బకాయి పడింది.
కావూరి సాంబశివ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 18 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,000 కోట్ల మేర రుణాలు తీసుకుందని చెబుతున్నారు.
కావూరికి చెందిన ఇంజినీరింగ్ సంస్థ ప్రొగ్రెస్సివ్ కన్స్ట్రక్షన్స్ వాయిదా చెల్లింపులను చాలాకాలం క్రితం నిలిపేసిందని తెలుస్తోంది. బకాయిల వసూలు కోసం బ్యాంకులు జారీ చేసిన నోటీసులకు కూడా ఆ సంస్థ స్పందించలేదు.
ఈ నేపథ్యంలో సదరు బ్యాంకుల అధికారులు హైదరాబాదులోని ఆయన కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం మౌన నిరసన చేపట్టారు. తీసుకున్న రుణాలు చెల్లించి బ్యాంకులు దివాళా తీయకుండా చూడాలని వారు కావూరిని కోరారు.