21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆపై వరుస సెలవులు..!
హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. 20వ తేదీ (గురువారం) అర్ధరాత్రి నుంచి 24 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. అంటే 21వ తేదీ శుక్రవారం బ్యాంకులు పనిచేయవు. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు తప్ప మిగతా సేవలన్నీ నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో 4 యూనియన్ల ఉద్యోగులు పాల్గొంటున్నారు. లక్షలాది మంది సిబ్బంది విధులకు దూరంగా ఉండనున్నారు. 11వ వేతన సవరణ చేయాలనే డిమాండ్ తో పాటు బ్యాంకుల విలీనం ప్రక్రియ ఉపసంహరించుకోవాలనేది బ్యాంకు ఉద్యోగుల వాదన.
అదలావుంటే 22, 23 శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. 24వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. అయితే 25వ తేదీ మంగళవారం నాడు క్రిస్మస్ పండుగ ఉండటంతో ఆరోజు కూడా బ్యాంకులకు సెలవుంటుంది. ఈనేపథ్యంలో అటు ఒక్కరోజు సమ్మెతో పాటు వరుస సెలవులు ఖాతాదారులపై ప్రభావం చూపే అవకాశముంది. ఆమేరకు లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలని.. సమ్మెకు సహకరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.