రూ.160 కోట్లు చెల్లించండి: కావూరి ఇంటి ఎదుట బ్యాంకర్ల ధర్నా
హైదరాబాద్: రుణాలు తిరిగి చెల్లించాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు శనివారం సాయంత్రం మాజీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత కావూరి సాంబశివ రావు నివాసం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాలాపురి బస్తీలోని ఆయన ఇంటి ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు.
ఆబిడ్స్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖ అధికారులు, సిబ్బంది ఆయన నివాసం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కావూరి తీసుకున్న రూ.160 కోట్ల రుణం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ పేరిట రుణం తీసుకొని ఐదు నెలలుగా చెల్లించడం లేదన్నారు. నిరసనలో డిజిఎం రాజీవ్ పురి, సిబ్బంది అంబరీష్ ప్రసాద్, డీఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. గతంలోను బ్యాంకు ఉద్యోగులు ఆయన నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో ఆయన నివాసం ఎదుట బ్యాంకర్లు ఆందోళన చేపట్టారు. 18 బ్యాంకుల నుంచి రూ.1000 కోట్ల మేర రుణాలు తీసుకొని నాడు బ్యాంకర్లు ఆందోళన చేశారని వార్తలు వచ్చాయి.
కొద్ది రోజుల క్రితం, హైదరాబాదులోని ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్సులో పురాతన భవనం ఉన్న 1160 గజాలను కోర్టు అనుమతితో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వేలం నిర్వహించారు. కావూరికి చెందిన 'ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్' సంస్థ రూ.12 కోట్ల మేర వాణిజ్యపన్ను బకాయి పడటంతో నగరంలోని ఆయన స్థలాన్ని రెండు నెలల క్రితం బహిరంగ వేలానికి పెట్టారు.