పెద్ద నగదు నోట్ల రద్దుతో తగ్గిన మాంసం అమ్మకాలు
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్ల ప్రభావం మాంసాహార విక్రేతలపై పడింది. వారంతంలో ముక్క లేనిదే ముద్ద దిగని వారికి పెద్దనగదు నోట్ల రద్దు ప్రభావం ఇబ్బంది కల్గిస్తోంది.ఆదివారం రోజున మాంసాహార వ్యాపారులు వినియోగదారులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం మార్కెట్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కార్తీకమాసం కారణంగా మాంసాహారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య సాధారణంగా తగ్గుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో మాంసాహారం తినే వారు కూడ ఈ వారానికి వాయిదా వేసుకొనే పరిస్థితులు అనివార్యంగా మారాయి.
పెద్ద నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకు బ్యాంకుల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోంది. ఎటిఎం ల వద్ద నగదు దొరకని పరిస్థితి నెలకొంది. ఎటిఎంలలో డబ్బు నింపిన క్షణాల్లోనే ఖాళీ అయిపోతోంది.రద్దు చేసిన నగదును తీసుకొనేందుకు ఎవరూ కూడ ముందుకు రావడం లేదు.తమ వద్ద ఉన్న చిల్లర నగదునతోనే నాలుగైదు రోజుల వరకు కాలం వెళ్ళదీయాలని భావించే వారి సంఖ్య పెరిగింది.
అసలే కార్తీకమాసం కారణంగా మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం కూడ ఈ విక్రయాలపై పడింది. సాధారణంగా ఆదివారం రోజున మాంసాహారం కోసం మార్కెట్ల వద్ద జనం బారులు తీరుతారు. మేక, చేప, కోడి మాంసం కోసం ఉడయాన్నే మార్కెట్ కు వెళ్ళారు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఆయా మార్కెట్లలో రద్దు చేసిన నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. చిన్న నగదు ఇంకా వినియోగదారుల చేతుల్లోకి రాలేదు. దరిమిలా మార్కెట్ లో గిరాకీ లేక వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు.
శని, ఆదివారాల్లో కూడ బ్యాంకులు, పన్నుల చెల్లింపు కేంద్రాలు పనిచేయనున్నాయి. మాంసం వ్యాపారుల వద్ద బారులు తీరే బదులుగా పెద్ద నగదును వదిలించుకొనేందుకు ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. ఉదయాన్నే బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరారు. వచ్చే వారానికి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని మాంస వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.