నష్టాల్లో బార్లు..!ఏంటి.. తాగుడు తగ్గించారు అనుకుంటున్నారా..? కానే కాదు..! మరెలా..?
హైదరాబాద్ : బార్ షాపుల పరిదిలోని పర్మిట్ రూమ్ లు బార్ షాపుల పట్ల శరాఘాతంగా మారుతున్నాయి. అటు బార్లతో ఇటు పర్మిట్ రూం లతో రెండు విధాలా ఆదాయం పొందొచ్చన్న ఎక్సైజ్ శాఖ అంచనాలు తారుమారౌతున్నాయి. మందు బాబుతో కళకళలాడే బార్ అండ్ రెస్టారెంట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి! సంపన్నులే కాదు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు వెళ్లే జనతా సెక్షన్లదీ అదే పరిస్థితి! సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, సంపన్నులు.. ఇలా అన్ని వర్గాలూ బార్లకు వెళ్లడం తగ్గించేశారు! వీరంతా వైన్ షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూముల బాట పడుతున్నారు..!
బోర్లా పడుతున్న బార్లు..! పర్మిట్ రూంలతో పరేషాన్..!!
రాష్ట్రంలో బారు షాపులు గిరాకీ లేక ఈగలు తోలుకుంటున్నాయి. బార్లతో పోలిస్తే ఖర్చు తగ్గడంతో పాటు హాయిగా ‘ఓపెన్ ఎయిర్' పర్మిట్ రూముల్లో కూర్చొని మందు కిక్ను అనుభవిస్తున్నారు మందు బాబులు. అంతేనా బార్లలో దొరకని తలకాయ కూర, బోటి, ఫిష్ ఫ్రై వంటి స్నాక్స్ కూడా నోరూరిస్తుంటాయి. ఇలాంటి సౌకర్యాల కారణంగా మందుబాబులు బార్లను వదిలి పర్మిట్ రూముల వైపు పరుగులు పెడుతున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 బార్ల వరకు మూతపడినట్లు సమాచారం. అంతేకాదు 100 వరకు బార్ల యాజమాన్య హక్కులు మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1028 బార్లు, 2216 వైన్ షాపులు, 26 మద్యం విక్రయ అనుమతి ఉన్న క్లబ్బులు ఉన్నాయి.
పెగ్ సిస్టం, టైమింగ్సుతో బార్లకు ముప్పే..! ఆసక్తి చూపని మందు బాబులు..!!
బార్లకు పెగ్ సిస్టం, టైమింగ్స్ కూడా ముప్పుగా మారాయి. బార్లలో పెగ్గుల పద్ధతిలో మందు పోస్తుంటారు. స్మాల్ (30 ఎంఎల్), లార్జ్ (60 ఎంఎల్) రూపంలో వీటిని అందిస్తారు. ఒక్క లార్జ్ పెగ్గు ‘బ్లెండర్స్ ప్రైడ్' మద్యానికి 90, 100 వసూలు చేస్తున్నారు. అదే పర్మిట్ రూములోనైతే 250కు క్వార్టర్ బ్లెండర్స్ ప్రైడ్ సీసా (180 ఎంఎల్) లభిస్తోంది. చౌకగా తినుబండారాలూ లభిస్తున్నాయి. బార్లకు టైమింగ్సూ ప్రతికూలంగా మారాయి. ఇదివరకు జీహెచ్ఎంసీ పరిధిలోని వైన్ షాపులను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకే తెరిచి ఉంచేవారు. కానీ ఎక్సైజ్ శాఖ వైన్షాపులను రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటును కల్పించింది. దీంతో మందుబాబులు వైన్ షాపుల పర్మిట్ రూముల్లోనే గడుపుతున్నారు.
నోరూరించే స్టఫ్..! చౌకగా నాన్ వెజ్..! ఇంకెందుకు బార్ కు వెళ్లడం..!!
బార్లకు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే అవకాశమున్నా ‘డ్రంకెన్ డ్రైవ్' భయంతో మందుబాబులు బార్లకు వెళ్లడం లేదు. ఇదిలా ఉండగా.. పర్మిట్ రూముల పేర వైన్ షాపుల యజమానులు నిబంధనలకు పాతర వేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం.. పర్మిట్ రూమును 1000 చదరపు అడుగుల్లోనే ఏర్పాటు చేయాలి. కానీ, వీటిని అర ఎకరం, ఎకరం మేర విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ, మేడ్చల్, సాగర్ రూట్లలో ఇలాంటి పెద్ద పెద్ద పర్మిట్ రూములు కనిపిస్తుంటాయి. పర్మిట్ రూముల్లో ఎలాంటి కుర్చీలు, టేబుళ్లను ఏర్పాటు చేయరాదు. తినుబండారాలను పెట్టడానికి వీల్లేదు. కానీ, పర్మిట్ రూములు సకల సౌకర్యాల కూడళ్లుగా మారిపోయాయి.
క్రమంగా తగ్గుతున్న బార్లు..! పర్మిట్ రూంలకు పెరుగుతున్న ఆదరణ..!!
2012 నుంచి ప్రభుత్వం వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల అనుమతులు మంజూరు చేస్తోంది. నాలుగేళ్ల నుంచి వైన్ షాపు లైసెన్సు ఫీజుతో పాటే పర్మిట్ రూముకు అదనంగా 2 లక్షలు వసూలు చేయడం మొదలు పెట్టింది. పర్మిట్ రూమును ఏర్పాటు చేసుకున్నా, చేసుకోకపోయినా 2 లక్షల ఫీజును చెల్లించాల్సిందే. దీంతో వైన్ షాపుల యజమానులు పక్కనే ఖాళీ స్థలాలను లీజుకు తీసుకుని పర్మిట్ రూములను ఏర్పాటు చేస్తున్నారు. బార్ల మాదిరిగానే గంటలకొద్దీ కూర్చుని మందు కొట్టే వెసులుబాటు ఉంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలంతా పర్మిట్ రూములకే మొగ్గు చూపుతున్నారు. కొంత మంది సంపన్న వర్గాలు కూడా సరదాగా ఇక్కడే మందు కొడుతున్నారు.