బాసర కీచక ప్రొఫెసర్పై వేటు.. పలు సెక్షన్ల కింద కేసు..స్టాఫ్కు మంత్రి ఇంద్రకరణ్ స్ట్రాంగ్ వార్నింగ్
బాసర : ఫెయిలైన విద్యార్థినులే లక్ష్యంగా వేధింపులకు పాల్పడిన బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ వరాల రవిపై వేటు పడింది. కీచకున్ని సస్పెండ్ చేయడంతో పాటు అతనిపై కేసు బుక్ చేశారు. ఘటనను సీరియస్గా తీసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మహిళా ఎస్సైని నియమించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థినులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకెళ్లాలని సూచించారు.
ఫెయిలైన అమ్మాయిలే టార్గెట్.. బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..
విధుల నుంచి రవి సస్పెండ్
విద్యార్థులను వేధించిన కెమిస్ట్రీ హెచ్ఓడీ వరాల రవిపై పోలీసులు కేసు నమోదుచేశారు. విద్యార్థినులు, అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్409, 420, 506 కింద కేసు బుక్ చేశారు. మరోవైపు విద్యార్థినుల పట్ల కీచకుడిగా వ్యవహరించిన దుర్మార్గున్ని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వర్సిటీ వీసీ అశోక్ ప్రకటించారు. అతనిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపిన కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఉపేక్షించే ప్రసక్తేలేదన్న ఇంద్రకరణ్
ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వేధించిన కీచక ప్రొఫెసర్ ఘటనపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ట్రిపుల్ ఐటీని సందర్శించిన ఆయన.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంత మంది వల్ల వర్సిటీకి చెడ్డపేరు రావడం బాధాకరమని, తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే నిందితుడు రవిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు. ట్రిపుల్ ఐటీకి పూర్తిస్థాయి వీసీని నియమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇంద్రకరణ్ ప్రకటించారు.
మహిళా ఎస్సై నియామకం
విద్యార్థినుల భద్రత దృష్ట్యా ట్రిపుల్ ఐటీలో మహిళా ఎస్ఐను నియమించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మంగళవారం నుంచి లేడీ ఎస్ఐ విధుల్లో ఉంటారని చెప్పారు. అనుమతి లేకుండా అమ్మాయిల్ని బయటకు పంపిన ఔట్ గేట్ సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తేలేదని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. చాకచక్యంగా వ్యవహరించి రవి బండారాన్ని బయటపెట్టిన వార్డెన్ను ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థినులే టార్గెట్
ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థినులను రవి లక్ష్యంగా చేసుకునేవాడని తెలిసింది. 4 నెలల క్రితం రాత్రి వేళలో అతడు విద్యార్థినులతో ఏకాంతంగా ఉండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. 20 రోజుల క్రితం కూడా రవి ఓ అమ్మాయిని కారులో తీసుకెళ్తుండగా.. గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే రవి ఇది తన వ్యక్తిగత విషయమని, మీరు కల్పించుకోవద్దని రవి చెప్పిన వీడియో ఒకటి పోలీసులకు అందింది. మరోవైపు రవిపై కేసును కొందరు అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలను వేధించిన దుర్మార్గుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేయకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.