బతుకమ్మ ఊరేగింపు: కవిత, పద్మా దేవేందర్ రెడ్డి పూజలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాదులోని ఎల్బీస్టేడియం నుంచి మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి బతుకమ్మతో ఎల్బీస్టేడియంకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకుని ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరారు. బతుకమ్మల ర్యాలీ ఎల్బీ స్గేడియం నుంచి బషీర్ బాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది. వేలాది మంది బతుకమ్మలు ఎత్తుకుని చేస్తున్న ర్యాలీతో భాగ్యనగరమంతా పూల వనంలా విలసిల్లింది.
సద్దుల బతుకమ్మను ఘనంగా జరపడానికి ట్యాంక్బండ్పై ఏర్పాట్లు జరిగాయి. బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్బండ్ పరిసరాలు సందడిగా మారాయి. విద్యుత్తు కాంతులతో ట్యాంక్బండ్ ధగధగలాడుతోంది. వేలాది మంది మహిళలు, కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.