లండన్: థేమ్స్ నది తీరాన బతుకమ్మ వేడుకల్లో కవిత(పిక్చర్స్)
లండన్: ఇంగ్లాండ్లోని థేమ్స్ నదీతీరాన తెలంగాణ పూల జాతర వెల్లివిరిసింది. ఈస్ట్ లండన్ నగరంలో జరిగిన బంగారు బతుకమ్మ లండన్ వాసులను ఆకట్టుకుంది. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాఖ నిర్వహించిన బంగారు బతుకమ్మ కార్యక్రమంలో వేలాది మంది ప్రవాస తెలంగాణ మహిళలు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలు
వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో....బంగారు బతుకమ్మ ఉయ్యాలో....ఉయ్యాల పాటలు పాడారు. బతుకమ్మ ఆటా...పాటతో లండన్ పులకించింది. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు ఆబాల గోపాలం. లాంబాత్ మేయర్ సెలేహా జాఫర్ ఎంపి కవితతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వాటిని తయారు చేసిన మహిళలకు కవిత బహుమతులను ప్రధానం చేశారు.
మనసంతా తెలంగాణపైనే
వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. తెలంగాణ ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉంటుందన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణలో సకల జనులు ఉద్యమంలో పాల్గొంటున్న సమయంలో లండన్లో ఉంటూ...తెలంగాణలో ఏం జరుగుతున్నదని ఆత్రంగా తెలిసిన వారికి ఫోన్లు చేసి కనుక్కున్నారని, నాకూ వందలాది మంది రోజూ ఫోన్ చేసే వారని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమానికి మీరిచ్చిన మద్ధతు విలువైనదన్నారు.
బతుకమ్మ పేర్చుతూ..
లండన్లో ఉంటూ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం విశేషమన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే కాకుండా వారిని పాల్గొనేలా చూస్తున్న ప్రవాస తెలంగాణ కుటుంబాలను కవిత అభినందించారు. తెలంగాణ గొప్పదనాన్ని, బతుకమ్మ విశిష్టతను ఆడపడుచుల పండగ సంతోషాన్ని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
విశ్వవ్యాప్తం
తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకే దక్కుతుందన్నారు ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి . తెలంగాణ ఉద్యమంలో కవిత బతుకమ్మలతో ఉద్యమించిన తీరు తెలంగాణ సమాజం మరువదన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుషులు ఎక్కువగా పాల్గంటున్న రోజుల్లో బతుకమ్మల ద్వారా మహిళలను ఉద్యమంలోకి తీసుకురావడంలో కవిత సఫలీకృతులయ్యారన్నారు.
సంబరాలు
కవితతో పాటు లండన్ వెళ్లిన కవి,రచయిత నందిని సిద్దారెడ్డి బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. ఉద్యమ సమయంలో ఈ కార్యక్రమంలో న్యూ హాం కౌన్సిలర్ పాల్, రెడ్బ్రిడ్జ్ మేయర్ బామర్ బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇండియన్ హై కమిషన్ కార్యదర్శి విజయ్ వసంత్ వేడుకలు పూర్తయ్యేంత వరకూ ఉన్నారు.
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
బతుకమ్మ ఏర్పాట్లు బాగున్నాయంటూ తెలంగాణ జాగృతి యూకె శాఖ అధ్యక్షుడు సంపత్ దన్నమనేని, ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రెడ్డిలను వసంత్ అభినందించారు.
ఎంపీ కవిత
వేడుకల్లో తెలంగాణ జాగృతి యూకె శాఖ ఉపాధ్యక్షుడు సుమన్ బల్మూరి, సుష్మ జువ్వాడి, సంతోష్ కుమార్, పావని గణేశ్, ప్రశాంత్ పూస, రఘు జక్కుల, కిశోర్ కుమార్, కత్తి పావని, వంశీ , సలామ్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి నిర్వహించిన బతుకమ్మల వేడకలకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ ఎన్నారై ఫోరం, ఎన్నారై టిఆర్ ఎస్ సెల్ నాయకులు పాల్గొన్నారు.