నేటి నుండే బతుకమ్మ సంబరాలు .. కరోనా నేపధ్యంలో జాగ్రత్త.. ఎమ్మెల్సీ కవిత సందేశం
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజున సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ప్రతి ఏడు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అయితే ఈసారి బతుకమ్మ సంబరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కరోనా నేపథ్యంలో ఏర్పడింది.
కవితకు మంత్రుల శుభాకాంక్షల వెల్లువ ... ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోకి స్వాగతం అంటూ
తెలంగాణా మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన కవిత
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. నేడు తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ తెలంగాణ మహిళలంతా సంబరంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే తంగేడు, గునుగు, కట్ల ,బంతి, చామంతి ఇలా రకరకాల పూలు సేకరించిన మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి పండుగకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన కెసిఆర్ తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా కృషి చేసిన కవిత బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు .
కరోనా నేపధ్యంలో జాగ్రత్త అంటూ సందేశం
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ కవిత కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడవద్దని కవిత తన సందేశంలో పేర్కొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
బతుకమ్మ స్పూర్తితో కరోనాను ఎదుర్కొందాం అని పిలుపు
బతుకమ్మ పండుగ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చిన కవిత, మహిళలందరూ అప్రమత్తంగా ఉండాలని సామాజిక దూరం పాటిస్తూ , మాస్కులు ధరించి ఈ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వందల ఏళ్ల నుంచి మన ఆడబిడ్డలు ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టిఆర్ఎస్ ఒక వేడుకగా నిర్వహిస్తోందని కవిత తెలిపారు.
Recommended Video
ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు.. ఈ సారి బతుకమ్మ సంబరాలు కష్టమే
ఒక అన్నగా, ఒక కొడుకుగా రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు ఈ పండుగ వేళ చీర రూపంలో చిరు కానుకను సీఎం కెసిఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య బంధించిన కరోనా కారణంగా ఈసారి ఘనంగా పండుగను జరుపుకోలేకపోతున్నామని కవిత తెలిపారు. ఒకపక్కన కరోనా, మరోపక్కన తెలంగాణా రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల నేపధ్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకునే అవకాశం లేకుండా పోతుందని మహిళలు తెగ బాధ పడుతున్నారు.