టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
టీవీల్లో, పత్రికల్లో చెప్పిన మాటలకు పంపిణీ చేస్తున్న చీరలకు పొంతన లేదని మహిళలు వాపోతున్నారు.
Recommended Video
హైదరాబాద్: అనుకున్నదొకటి.. అయింది మరొకటి. పండుగ పూట తెలంగాణ ఆడబిడ్డలను ఖుషీ చేసి పార్టీ మీద వాళ్ల దీవెనార్తి ఉండాలనుకున్న టీఆర్ఎస్కు ఊహించని దెబ్బ తలిగింది. దీవెనలు పక్కనపెడితే శాపనార్థాలతో ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న పరిస్థితి.
దీనంతటికి కారణం బతుకమ్మ చీరలు రేపిన అసంతృప్తి. టీవీల్లో, పత్రికల్లో చెప్పిన మాటలకు పంపిణీ చేస్తున్న చీరలకు పొంతన లేదని మహిళలు వాపోతున్నారు. రోడ్డెక్కి చీరలు తగలబెట్టి మరీ నిరసన తెలియజేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి తెలంగాణ ఆడబిడ్డల నుంచి గట్టి దెబ్బ తగిలినట్లయింది.
ముందు చూపు లేకనే:
ప్రతిపక్షాల నీచ రాజకీయమంటూ అధికార పార్టీ కవర్ చేసుకోవచ్చు కానీ అందులోని లోటు పాట్లను మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కోటి చీరల పంపిణీకి సంబంధించిన వ్యవహారం పట్ల ఏమరపాటుగా ఉండటం వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని చెబుతున్నారు. ముందు చూపు లేకపోవడం.. ఒక్కసారిగా అన్నేసి చీరలను నేతన్నలు సైతం అందించే పరిస్థితి లేకపోవడంతో.. సూరత్, సూలెగావ్ నుంచి చీరలు తెప్పించినట్లు తెలుస్తోంది.
జగిత్యాల, భువనగిరిల్లో చీరలు తగలబెట్టి:
సూరత్, సూలెగావ్ల నుంచి చీరలు తెప్పించడం వరకు బాగానే ఉంది కానీ మరీ నాసిరకం చీరలిచ్చి 'పండుగ చేసుకోండి' అనడం మహిళల ఉక్రోశానికి కారణమైంది. వాటి క్వాలిటీ చూస్తే రూ.100కి మించి ఎక్కువ ఉండవని చెబుతున్నారు. ప్రకటనలల్లో గద్వాల చీరలు, సిరిసిల్ల నేత చీరలు అంటూ ఊదరగొట్టి చివరకు ఈ నాసిరకం వాటిని అంటగట్టడంతో వారి సహనం నశించింది.
జగిత్యాల, పెద్దపల్లి, నందిమేడారం, ధర్మసాగర్, జనగామ,సోమదేవరపల్లి, కోనరావుపేట,భువనగిరి, పరకాల, గూడూరు, ఖమ్మం.. ఇలా చాలా ప్రాంతాల్లో మహిళలంతా ఈ చీరలను రోడ్డు మీదకు విసిరేశారు. కొన్నిచోట్ల నిప్పంటించి తగలబెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హడావుడిగా టెండర్లు..:
నిజానికి నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తూ.. తెలంగాణ ఆడపడుచులకు పండుగ పూట చీరలు పంపిణీ చేయడం మంచి పనే అయినప్పటికీ.. ముందు చూపు లేకపోవడం వల్ల టీఆర్ఎస్ బద్నాం అవుతున్న పరిస్థితి. కోటి చీరలను ఇప్పటికిప్పుడు అందించే సామర్థ్యం నేతన్నలకు లేకపోవడంతో ప్రభుత్వమే హడావుడిగా టెండర్లు పిలిచి హోల్ సేల్ వస్త్ర దుకాణాల నుంచి చీరెకు రూ.290చొప్పున కోటి చీరలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
పర్యవేక్షణ లేకనే:
చీరల కొనుగోళ్ల వ్యవహారంలో పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తోంది. అందువల్లే నాణ్యత లేని నాసిరకం చీరలు పెద్ద ఎత్తున ఇందులోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. చీరల సంఖ్య భారీగా ఉండటంతో.. వాటిని పరిశీలించడం కూడా వారికి కుదరలేదు. ఇదే ఆసరాగా భావించిన కొంతమంది కక్కుర్తిపరులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నాసిరకం చీరలతో ప్రభుత్వ పరువు తీశారని పలువురు అంటున్నారు.
బద్నాం చేసే కుట్ర:
బతుకమ్మ చీరలను బద్నాం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను మహిళలు గ్రహించండి. ఆడవాళ్లు.. చీర, సారెలను తగలబెట్టిన దాఖలాలు ఎన్నడూ లేవు. దీని వెనుక ఏదో కుట్ర ఉన్నది. ప్రజలు దీన్ని గమనించాలి. కోటిమంది మహిళలు బతుకమ్మ సారెను కళ్లకు అద్దుకుంటుంటే.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల కార్యకర్తలను బయటకు పంపి.. రోడ్ల మీద ఆందోళనలు చేయిస్తున్న ప్రతిపక్షాల నాయకుల్లారా?? మీ మొహాలకు ఎప్పుడైనా బతుకమ్మ పండుగను జరిపారా??. లేక బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు పది రూపాయలు ఖర్చు పెట్టారా??. మరి ప్రభుత్వం ఆడబిడ్డలకు ఎంతోకొంత ఆసరాగా ఉండేందుకు చీరలు పంచుతుంటే ఎందుకు విష ప్రచారం చేస్తున్నారో మీకే తెలియాలి??
కుంభకోణం: రేవంత్ రెడ్డి
నాసిరకం చీరల పంపిణీపై తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ చీరల పేరిట ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.పేద మహిళలకు పంచిన చీరల విలువ ఒక్కోటి రూ. 50కి మించదన్నారు.
చీరల కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే.. రోజుల తరబడి తనను తిప్పుతున్నారని అన్నారు. సూరత్ నుంచి కేజీల లెక్కన నాసిరకం చీరలు తెచ్చి.. పేద మహిళలను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిందన్నారు. చీరల కొనుగోలులో ప్రభుత్వ పెద్దలు రూ. 150 కోట్లు నొక్కేశారని ఆరోపించారు. చీరల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మహిళలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
కొట్టుకున్న మహిళలు:
బతుకమ్మ చీరల పంపిణీలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్, సైదాబాద్ సరస్వతి శిశుమందిరంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో క్యూలైన్ల వద్ద మహిళలు కొట్టుకున్నారు.
టీవీ సీరియల్ తరహాలోనే జట్టు పీక్కున్నారు. కొట్టుకుంటున్న మహిళలను విడదీయడం అక్కడున్న మహిళా పోలీస్ల వల్ల కాలేదు. పిడిగుద్దులతో దాడి చేసుకోవడంతో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనతో భయపడిన మరికొందరు వెనక్కితిరిగి వెళ్లిపోయారు.
చీప్ ట్రిక్స్:
నాసిరకం చీరలు ఇస్తూ మహిళలను కేసీఆర్ అవమానిస్తున్నారని కాంగ్రెస్ మహిళానేత నేరెళ్ల శారద అన్నారు. మహిళల ఓట్ల కోసం చీప్ ట్రిక్స్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం లేదు.. కానీ.. మద్యం షాపుల సమయం పెంచారని ఆమె మండిపడ్డారు.
50శాతం సూరత్ నుంచే:
సిరిసిల్ల మరమగ్గాలపై పాలిస్టర్ చీరలు మాత్రమే నేస్తారని తెలుస్తోంది. పథకాన్ని జులైలో అనుకుని మొదలుపెట్టడంతో సమయం తక్కువగా ఉండటం వల్ల 50శాతం చీరలను సూరత్ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ పథకం వల్ల సిరిసిల్ల నేత కార్మికులకు 120కోట్ల వర్క్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల 20వేల మంది కార్మికులకు నెలకు 15-20వేల సంపాదించుకునే అవకాశం కలిగిందంటున్నారు. వచ్చే సంవత్సరం ఈ కాంట్రాక్టు మొత్తం తెలంగాణ నేతన్నలకే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
నీచ రాజకీయం:
బతుకమ్మ చీరలపై కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. చిరు కానుకగా ఇచ్చిన చీరలపై నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.