కెసిఆర్కు కొత్త చిక్కు: 'ఏపీ సహా పక్క రాష్ట్రాల్లోలేదు, నిప్పుతో చెలగాటం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రిమిలేయర్ (సంపన్న శ్రేణి) చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిమిలేయర్ను అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు కెసిఆర్ ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి. బిసిలను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే దీనిని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు.
సుప్రీం కోర్టు ఎప్పుడో క్రిమిలేయర్ విషయమై తీర్పు చెబితే ఇప్పుడు తెరపైకి తీసుకు రావడం ఏమిటని, ఏ రాష్ట్రం కూడా క్రిమిలేయర్ అమలు చేయడం లేదని బిసి సంఘాలు అంటున్నాయి. తెలంగాణలో అమలు చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
సమాజంలో ఎదగాలంటే ఉద్యోగమే తొలి మెట్టు అని, అలాంటి తొలి మెట్టుకే క్రిమిలేయర్ పేరుతో ఎసరు పెడితే బిసిలు ఎలా ఎదుగుతారని ప్రశ్నిస్తున్నారు. క్రిమిలేయర్ను తెలంగాణలో అమలు చేస్తే తీవ్ర ఉద్యమం ఎగిసిపడుతుందని చెబుతున్నారు.
బీసీలతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమే: ఆర్ కృష్ణయ్య
క్రిమిలేయర్ అంటూ బీసీలతో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటమేనని బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు రిజర్వేషన్లు లేవని చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించి క్రిమిలేయర్ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పక్కనున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ఏ రాష్ట్రాలలోను క్రిమిలేయర్ లేదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడి ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలని చూస్తోందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. తాము క్రిమిలేయర్ పైన పోరాటం చేస్తామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు లేని క్రిమిలేయర్ బిసిలకు మాత్రం ఎందుకని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు క్రిమిలేయర్ పైన ఇరవై ఏళ్ల క్రితం తీర్పు చెప్పిందని, కానీ దానిని అన్ని రాష్ట్రాలు పక్కన పెట్టాయన్నారు. కేంద్రంలోనే క్రిమిలేయర్ ఎత్తివేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.
అనుమానాలు వద్దు: జోగు రామన్న
క్రిమిలేయర్ పైన ఎలాంటి అనుమానాలు వద్దని మంత్రి జోగు రామన్న ఢిల్లీలో చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలనే తాము అమలు చేస్తున్నామని చెప్పారు. న్యాయసలహా తర్వాతనే క్రిమిలేయర్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పేద బీసీలకు అన్యాయం రానివ్వమన్నారు.