టీడీపీని వీడి.. కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న ఎమ్మెల్యే!?..
హైదరాబాద్: 'ఆర్. కృష్ణయ్య'.. పేరుకు టీడీపీ ఎమ్మెల్యే అయినా.. ఆ పార్టీతో ఆయన తొలి నుంచి అంటీముట్టనట్లుగానే ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆయన 'బీసీ' యాక్టివిజంలో ఎలాంటి మార్పు రాలేదు. మునుపటి లాగే బీసీల సంక్షేమం కోసం, అభివృద్ది కోసం పాటుపడుతున్నారు.
అయితే వీటిన్నంటి కన్నా.. బీసీ రాజ్యాధికారం ద్వారానే ఆ సామాజికవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ది సాధిస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకంటూ ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఉండాలని భావిస్తున్నారు. తన నాయకత్వంలోనే భవిష్యత్తులో బీసీ రాజకీయ పార్టీ పురుడు పోసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు పంపించారు.
రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్న బీసీల కోసం కొత్తగా పార్టీ పెట్టే యోచన ఉన్నట్లు ఆర్. కృష్ణయ్య తాజాగా ప్రకటించారు. బీసీల కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలన్ని నామమాత్రమేనని, త్వరలోనే 5లక్షల మందితో హైదరాబాద్ లో బీసీ సభను ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్త పార్టీ దిశగా కదులుతున్నారంటే.. టీడీపీకి ఇక అధికారికంగా గుడ్ బై చెప్పే యోచనలో ఆర్. కృష్ణయ్య ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కాగా, 2014ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎల్.బి నగర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు ఆయన టీడీపీ సభ్యుడిగా కాకుండా స్వతంత్రగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.