చరిత్రలో మొదటిసారి : పొలిటికల్ కోటా కోసం బీసీల స్టేట్ బంద్
ప్రజా సమస్యలపై గళమెత్తడం సహజం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడటం సర్వసాధారణం. అయితే పొలిటికల్ కోటాపై నిరసనలు వినిపించడమే తెలుసు కానీ బంద్ కు పిలుపునివ్వడం కొత్త. అవును చరిత్రలో తొలిసారిగా ఇది తెలంగాణలో జరగనుంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు బీసీలకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదంటూ బీసీ సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈనెల 17న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో బీసీ సంఘాల నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
టీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో 105 మందికి గాను 20 మంది బీసీలకు స్థానం దక్కితే, కాంగ్రెస్ ప్రకటించిన 65 స్థానాల్లో 13 మంది బీసీలకు చోటు కల్పించారు. అటు టీడీపీ అనౌన్స్ చేసిన 9 సీట్లల్లో ఇద్దరు బీసీలకు అవకాశం లభించింది. తెలంగాణలో బీసీ ఓటర్ల గణనీయంగా ఉండటంతో పొలిటికల్ కోటా పెంచాల్సిందేనంటూ బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా తమకు అన్యాయమే జరుగుతోందంటూ బీసీ సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. అదే క్రమంలో ఈనెల 17న స్టేట్ బంద్ కు పిలుపునిచ్చాయి.
రాజకీయ పార్టీలపై బీసీలు గరం
రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఎన్నికలప్పుడు తమను మభ్యపెట్టి గంపగుత్తగా ఓట్లు వేయించుకుంటున్నాయని మండిపడుతున్నారు. వివిధ రంగాల్లో తమకు జరుగుతున్న అన్యాయం చాలాదన్నట్లు పొలిటికల్ గా కూడా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా బీసీలకు న్యాయం జరగలేదంటున్న బీసీ సంఘాల నేతలు రాజకీయ పార్టీలపై గరమవుతున్నారు. ఈసారైనా రాజకీయ పార్టీలు తమను ఆదరించి సీట్లు ఇస్తాయని భావిస్తే.. ఈ దఫా కూడా అన్యాయమే జరిగిందని ఫైరవుతున్నారు.
అగ్రవర్ణాల ఆధిపత్యం.. బీసీలకు అన్యాయం
తెలంగాణలో బీసీల ఓట్లు ప్రామాణికంగా మారాయని చెప్పొచ్చు. ఇక్కడ 2.73 కోట్ల ఓటర్లు ఉండగా.. అందులో బీసీ ఓటర్లు 1.39 కోట్లు ఉంటారని అంచనా. దీంతో ఆయా పార్టీల గెలుపోటములపై బీసీల ఓట్లు కచ్చితంగా ప్రభావం చూపుతాయి. అయితే రాజకీయ పార్టీల్లో అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా బీసీలకు పొలిటికల్ కోటాలో అన్యాయం జరుగుతుందనేది బీసీ సంఘాల నేతల ఆరోపణ. ఇప్పటివరకు నిరసనగళాలు మాత్రమే వినిపించిన బీసీ సంఘాల నేతలు ఇప్పుడు రాజకీయ పార్టీలతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. న్యాయంగా తమకు రావాల్సిన కోటాపై పోరాడేందుకు సిద్దమై.. స్టేట్ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
అంతటా అన్యాయమేనా?
బీసీ కులాలకు వివిధ రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించడం లేదంటూ పలు సందర్భాల్లో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రోడ్ల మీదకు వచ్చారు. ప్రభుత్వాలు దిగి వచ్చేలా నిరసనలు చేపట్టారు. అయితే పొలిటికల్ కోటాపై నిరసన గళం వినిపించడమే గాకుండా తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేసిన బీసీ సంఘాల నేతలు రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
బీసీల విషయంలో పొలిటికల్ పార్టీల స్టాండేంటి?
2014 ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు బీసీ ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా కనిపిస్తుంది. అన్నీ పార్టీలకు కలిపి కేవలం 20 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సహా 18 మంత్రి పదవుల్లోనూ కేవలం నలుగురు బీసీలకు మాత్రమే అవకాశం లభించింది. గత ఎన్నికల దృష్టా కనీసం ఈసారైనా బీసీలకు ఆయా పార్టీలు న్యాయం చేస్తాయని భావించారు బీసీ సంఘాల నేతలు. అయితే ఈసారి కూడా బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదన్నది వారి ఆరోపణ. అందుకే తప్పని పరిస్థితుల్లో ఆందోళనలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
రాజకీయంగా తమకు సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని బీసీ సంఘాల నేతలు అంటుంటే.. వారికి పెద్దపీట వేస్తున్నామంటున్నాయి పొలిటికల్ పార్టీలు. బీసీలకు సీట్లు కేటాయించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామే తప్ప లెక్కలు తప్పబోమని చెబుతున్నాయి. పార్టీ అంతర్గత కమిటీల్లోనూ, నామినేటేడ్ పోస్టుల్లోనూ వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని అంటున్నాయి.