ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే కోటా.. బీసీలకు 23 శాతమేనా?
హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా బీసీలకు 23 శాతం రిజర్వేషన్ కోటా అమలవుతోంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ అదే కోటా అమలైంది. ఇక రానున్న మండల, జడ్పీ ఎన్నికల్లోనూ బీసీలకు 23 శాతం రిజర్వేషన్లే ఖరారు కానున్నాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా బీసీ కోటా 23.81 శాతానికి పరిమితం కానుంది.
బీసీ కోటా అంతే
పంచాయతీ ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. రిజర్వేషన్లను తగ్గించి అమలు చేయడంతో.. బీసీలకు 23.81 శాతం కోటా మాత్రమే దక్కినట్లైంది. ఆ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ బీసీలకు 23.81 శాతం మేరకే రిజర్వు కానున్నాయి. 34 శాతం ఖరారు చేస్తూ నూతన పంచాయతీ రాజ్ చట్టంలో పొందుపరిచింది ప్రభుత్వం. ఆ నేపథ్యంలో దాన్ని కుదించేందుకు వీలుగా అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది.
23.81 శాతమే..!
పంచాయతీ రాజ్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు గతంలో 60.19 శాతం అమలయ్యేవి. ఇందులో బీసీలకు 34 శాతం దక్కేది. 2018, ఏప్రిల్ లో అమల్లోకి తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంలోనూ బీసీలకు ఇదే శాతాన్ని వర్తింపజేస్తూ పొందుపరిచింది. అయితే బీసీలకు 34 శాతంతో గతేడాది పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఆ క్రమంలో న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 23.81 శాతం కోటా అమలైంది.
చట్ట సవరణ.. సభ ఆమోదం
పంచాయతీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లోగా పూర్తిచేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ నేపథ్యంలో అప్పటికప్పుడు 2018 డిసెంబర్ 15న ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను, జూన్ లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించే సంకల్పంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది. ఈక్రమంలో ఆర్డినెన్స్ స్థానంలో చట్ట సవరణ చేసేందుకు శాసనసభలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. దీంతో బీసీలకు 23.81 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.