కన్నీళ్లు పెట్టుకున్న కోట, బాబుమోహన్.. తాగండి, కానీ రోడ్ల పైకి వద్దు: నాయిని
కొడుకు ప్రయోజకుడు కావాలని కలలు గని ఆరుగాలం శ్రమించే తల్లిదండ్రులకు అన్యాయం చేయవద్దని ఈ తరం యువకులకు హితవు పలికారు.
హైదరాబాద్: దేశంలో ప్రతీరోజు రోడ్లు నెత్తురోడుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రమాదాలను కొనితెచ్చుకునేవారు కొందరైతే.. ఎదుటివాళ్ల నిర్లక్ష్యానికి బలైపోయేవారు మరికొందరు.
రమ్య కుటుంబంలో మరో విషాదం: చికిత్స పొందుతూ తాత మృతి
రోడ్లపై తాగుబోతులు చేసే వీరంగానికి కుటుంబాలే కకావికలమైపోయిన పరిస్థితి. పంజాగుట్టలో తాగుబోతులు చేసిన వీరంగానికి ఓ కుటుంబమే బలైపోయిన సంగతి తెలిసిందే. చిన్నారి రమ్యతో పాటు ఆమె కుటుంబంలో మరో ఇద్దరు రోడ్డు ప్రమాదానికి బలైపోయారు.
'ట్రాఫిక్ సేఫ్టీ' అవగాహన సదస్సు:
ఎమ్మెల్యే బాబుమోహన్, సినీనటుడు కోట శ్రీనివాసరావు వంటివారు సైతం తమ కుమారులను రోడ్డు ప్రమాదంలోనే కోల్పోయారు. దీంతో తమకు జరిగిన నష్టం మరెవరికీ జరగకూడదన్న ఆలోచనతో.. ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు.
నగరంలో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్, డీజీపీ అనురాగ్ శర్మ, ఏడీజీపీ కృష్ణప్రసాద్, సినీ నటుడు కోట శ్రీనివాసరావు హాజరయ్యారు.
రాచకొండ పోలీస్ కమీషనరేట్ ఎల్బినగర్ డిసిపి తఫ్వీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం నాడు 'యాక్సిడెంట్ ఫ్రీ డే' సందర్బంగా.. రోడ్డు భద్రతా అవగాహన సదస్సును నిర్వహించారు.
తాగితే రోడ్లపైకి రాకండి: నాయిని
'మద్యం ఎంతైనా తాగండి.. కానీ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. అంతేగానీ మద్యం మత్తులో వాహనాలతో రోడ్ల పైకి వచ్చి అమాయకుల ప్రాణాలు తీయవద్దు' అంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హితవు పలికారు.
తాగి వాహనాలను నడిపిన కారణంగా తెలంగాణలో 30వేల కుటుంబాలు రోడ్డున పడ్డట్టుగా నాయిని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన యువత నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.
రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడంలో రవాణా, ట్రాఫిక్, పోలీస్శాఖలు ప్రవేశపెట్టే ప్రతి నియమ నిబంధనలు మన జీవితాలు నిండు నూరేళ్లు సాగాలని, బంగారు భవిష్యత్తును పొందడం కోసమేనని రాష్ట్ర హోం, రవాణా శాఖ మంత్రులు నాయినినర్సింహ్మారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
జీవితంలో అంత దు:ఖిస్తున్నా: బాబు మోహన్
సినిమాల్లో కోట శ్రీనివాసరావు, ఇతర సహచర నటులతో కలిసి ఎంతగా నవ్వించానో.. ఇప్పుడంతగా దు:ఖిస్తున్నానని ఎమ్మెల్యే బాబుమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కొడుకును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాను మూడో తరగతి చదువుతున్నప్పుడే తల్లిని కోల్పోయానని, చేరదీసేవారు లేక తండ్రి తనను హాస్టల్ లో చేరిపించారని బాబు మోహన్ తన చిన్నతనాన్ని గుర్తుచేసుకున్నారు. స్కూల్, కాలేజీల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్న తాను.. కష్టపడి ఉద్యోగం సాధించుకున్నానని అన్నారు.
120మంది రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం కోసం పోటీ పడగా.. 18మందిని ఎంపిక చేశారని, అందులో తాను ఒకడినని బాబు మోహన్ చెప్పారు. ఆ తర్వాత నటనపై ఇష్టంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి మంచి నటుడిని అయ్యానని ఆ తర్వాత 3సార్లు ఎమ్మెల్యే, క్యాబినేట్ మంత్రిగా పనిచేశానని, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించి నిండు జీవితాన్ని గడుపుతూ మిమ్మల్ని, మిమ్ము కన్నవారికి సంతోషాన్ని అందివ్వాలని సూచించారు.
కన్నవారి కడుపుకోత గుర్తించాలి: కోట శ్రీనివాసరావు
ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చి కని పెంచే కన్న తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చవద్దని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క యువకుడు, పిల్లలు ఈ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
కొడుకు ప్రయోజకుడు కావాలని కలలు గని ఆరుగాలం శ్రమించే తల్లిదండ్రులకు అన్యాయం చేయవద్దని ఈ తరం యువకులకు హితవు పలికారు. అర్థంతరంగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కన్నవారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవాలని అన్నారు.
తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కోట శ్రీనివాసరావు ఉద్వేగానికి లోనయ్యారు. జీవితంలో ఎన్ని ఉన్నా కన్న కొడుకు లేడన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
ప్రభుత్వాలు, వివిధ శాఖలు ప్రవేశపెట్టే ప్రతి నియమంను పాటించి నిండు జీవితాన్ని గడపాలని సూచించారు. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు లేకుండా, సెల్ఫోన్లో సంభాషిస్తూ, రాంగ్రూట్లో వెళ్లి వాహనాలను నడపరాదని ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.