రోజుకు 12లక్షల బీర్లు: అంచనాల్ని మించి తాగుతున్నారు.. అధికారులకే షాక్!
సెప్టెంబర్ మాసంలో లాగే అక్టోబర్ మాసం కూడా ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండిస్తోంది.
హైదరాబాద్: సెప్టెంబర్ మాసంలో లాగే అక్టోబర్ మాసం కూడా ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండిస్తోంది. అంచనాలకు మించి మద్యం విక్రయాలు జరుగుతుండటంతో.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా బీర్ విక్రయాలకు డిమాండ్ మరింత పెరిగింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన నెలలోనే విక్రయాలు జోరందుకోవడం గమనార్హం. సాధారణంగా అక్టోబర్ నెలలో అమ్మకాలు ఈ స్థాయిలో ఉండటం చాలా అరుదు. దీంతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. గతేడాది అక్టోబర్ నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబర్ లో 25శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి.
రోజుకు 12లక్షల బీర్లు:
గతేడాది ఏప్రిల్- సెప్టెంబరు మధ్య కాలంలో 176 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది అది 27.15 శాతం మేర పెరిగి 223 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. బీర్లతో కలుపుకుని మొత్తం మద్యం విక్రయాల్లో 9.72శాతం వృద్ది నమోదైంది. ప్రస్తుతం సగటున రోజుకు 12లక్షల బీర్ల చొప్పున విక్రయాలు జరుగుతుండటం విశేషం.
అక్టోబర్ లోను జోరుగా:
సాధారణంగా ఎండా కాలంలో బీరు విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ మాసంలో చలి మొదలవుతుంది కాబట్టి కాస్త విక్రయాలు తగ్గుముఖం పడుతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉండటంతో బీర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ టాప్, తర్వాత ఏపీ
దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం విక్రయాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. గతేడాది ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో రాష్ట్రంలో రూ.6,724.82 కోట్ల విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ వ్యవధిలో 20.80 శాతం మేర విక్రయాలు పెరిగి అమ్మకాలు రూ.8,123.55 కోట్లకు చేరుకున్నాయి. మద్యం విక్రయాల్లో తెలంగాణ తర్వాత స్థానంలో ఏపీలో ఉంది. ఈ ఏడాది ఇదే వ్యవధిలో ఏపీలో 13.67 శాతం మేర మద్యం విక్రయాలు పెరిగాయి.
కొత్త పాలసీ తీసుకొచ్చాక:
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా నడుస్తున్నాయి. అక్టోబరు 1 నుంచి 13వ తేదీ మధ్య రాష్ట్రంలో రూ.700 కోట్ల మద్యం విక్రయాలు జరగడం విశేషం. అంటే, సగటున రోజుకు రూ.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మున్ముందు ఈ విక్రయాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.