పడిపోయిన బీర్.. లిక్కర్ జోరు... తెలంగాణలో 'జులై' మద్యం ఆదాయం ఎంతో తెలుసా..
తెలంగాణలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. లిక్కర్ విక్రయాల్లో మాత్రం జోరు తగ్గలేదు. లాక్ డౌన్ ప్రారంభంలో బీర్ల విక్రయాలు బాగానే ఉన్నప్పటికీ... ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే మొత్తంగా గతేడాది జులై కంటే ఈసారి జులై నెలలోనే తెలంగాణలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తంగా ఒక్క జులైలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.2,507కోట్ల అమ్మకాలు జరగడంతో... దాదాపు రూ.600 కోట్లు అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.
కరోనా లాక్ డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ... తెలంగాణలో మద్యం ద్వారా అదనపు ఆదాయం చేకూరుతుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగివున్న ఖమ్మం,మహబూబ్నగర్,నల్గొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో... సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణలోని మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్నారు.
ఇక బీర్ల అమ్మకాలు పడిపోవడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకూ చల్లటి పదార్థాలను దూరం పెడుతున్నారు. జలుబు మొదలైతే లేనిపోని తలనొప్పి ఎందుకని చల్లటి పానీయాలకు దూరంగా ఉంటున్నారు. దానికి తోడు కరోనా కారణంగా విందులు,వినోదాలు కూడా తగ్గిపోవడం బీర్ల విక్రయానికి కారణంగా ఒక కారణంగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదా స్నేహితుల పుట్టినరోజులు... ఇలా వేడుక ఏదైనా ఎక్కువమంది ఒకేచోట కూర్చొని మద్యం సేవించే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో మునుపటిలా ఆయా ఫంక్షన్ల కోసం బీర్లు కొనుగోలు చేయడం తగ్గిందంటున్నారు.
గతేడాది జులైలో 31.34 లక్షల కేసుల బీర్ అమ్మకాలు జరగ్గా... ఈ ఏడాది జులైలో మాత్రం 22.29 లక్షల కేసుల బీర్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఇక గతేడాది జులైలో 31.48 కేసుల లిక్కర్ విక్రయాలు జరగ్గా... ఈ ఏడాది జులైలో 41.7 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి.