నగరంలో ఏరులై పారుతున్న బీర్లు..! ఎండలకు తెగ తాగేస్తున్నారు సార్లు..!!
హైదరాబాద్ : ఎండలతోపాటు బీరు అమ్మకాలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. వేసవి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు బీర్లు ఎక్కువగా తాగుతుండడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత వేసవిలో ఇదే నెలలో రోజుకు మూడున్నర నుంచి నాలుగు లక్షల కేసులను విక్రయించగా ప్రస్తుతం బీర్ల అమ్మకాలు 5 లక్షలకు చేరాయని వ్యాపారులు చెబుతున్నారు.
రికార్డుస్థాయిలో అమ్మకాలు...!వేసవి ఎండలతో పెరిగిన డిమాండ్..!!
నగరంలో బీర్ల కొరత ఏర్పడడంతో కొందరు వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. గ్రేటర్ పరిధిలో సాధారణ రోజుల్లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షలలోపు కేసులను అమ్మితే వేసవిలో మాత్రం రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. ఈసారి రికార్డుస్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపారులు వెల్లడించారు. పెరిగిన అమ్మకాల నేపథ్యంలో బీరు ఉత్పత్తి కంపెనీలకు బీవరేజీ కార్పొరేషన్ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెరుగుతున్నాయి.
జంటనగరాల్లోనే ఎక్కువ..! సాయంత్రం చల్లటి బీరుకోసం యువత పరుగులు..!!
జంటనగరాల్లో బీరుకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మకాలు పెంచేందుకు వ్యాపారులకు టార్గెట్లు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో మార్చి కంటే ఏప్రిల్, మే నెలల్లోనే బీరు వినియోగం భారీగా ఉంటుంది. ఈసారి మార్చి ప్రారంభం నుంచే వినియోగం భారీగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో వ్యాపారులకు ఇచ్చే టార్గెట్లు పూర్తయిపోయి అదనంగా బీరు కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇస్తున్నారు. సరఫరా మాత్రం తక్కువగా ఉందంటున్నారు.
రోజుకు 5లక్షల కేసులకు పైగా..! కొరత పేరుతో అధిక ధరల వసూలు..!!
గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మార్చి నెలలోనే బీరు అమ్మకాలు పుంజుకున్నాయి. ఇతర మద్యాలతోపోలిస్తే బీరు అమ్మకాలు అధికంగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గత సంవత్సరం మార్చితో పోలిస్తే ఈసారి 30శాతం అమ్మకాలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. జంటనగరాల్లో 180 దుకాణాలు, మరో 216 బార్లు, 18 క్లబ్బులు కలిపి సాధారణ రోజుల్లో రోజుకు 50 నుంచి 60వేల కేసులు బీరు అమ్మకాలు జరిగితే ఈ సారి మే నెలలో రోజుకు 4 నుంచి 5లక్షల కేసులను అమ్మడం రికార్డు అని అంటున్నారు.
సరఫరాలో కొరత..! క్యాష్ చేసుకుంటున్న వైన్ షాపుల ఓనర్లు..!!
సరఫరాలో కొరత ఉన్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు ఇదే అదనుగా విదేశీ బీరు అమ్మకాలను పెంచుకుంటున్నారు. దేశీయ కంపెనీలు తయారుచేసే బీరు కంటే విదేశీ బీరు ధర 30 నుంచి 50 రూపాయల వరకు అధికంగా ఉంటుంది. కొందరు వ్యాపారులు వీటి ధరలు కూడా పెంచే అమ్ముతున్నారు. మరి కొందరు వ్యాపారులైతే దేశీయ బీరును కూడా కొరత పేరు చెప్పి ధర పెంచి అమ్ముతున్నారు. ధరలను నియంత్రించాల్సి న అధికారులు పెద్దగా స్పందించడం లేదు. దీంతో మార్కెట్లో పెరిగిన బీరు డిమాండ్ను కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.