సాగర్ చూసేందుకొస్తే ప్రపంచ బ్యాంక్ బృందంపై తేనెటీగల దాడి, జూ.ఆర్టిస్ట్కు డ్రైవర్ వేధింపు
హైదరాబాద్: నాగార్జున సాగర్ సందర్శనకు వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యుల పైన తేనెటీగలు దాడి చేశాయి. దీంతో, వారు నాగార్జున సాగర్ జలాశయాన్ని చూడకుండానే వెనుదిరగవలసి వచ్చింది. ఈ సంఘటన శుక్రవారం నాడు ఉదయం జరిగింది.
ఢిల్లీలో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు
దేశ రాజధాని న్యూఢిల్లీలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ను పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్ను పోలీసులు విచారిస్తున్నారు. నైజీరియన్ నివాసంలో 10 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో, భారీగా మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న నైజీరియన్ ముఠాను ఢిల్లీలో సైబరాబాద్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్లు నివసిస్తున్న ఇంటిపై గురువారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు 8కిలోలకు పైగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 13మంది సభ్యులున్న ఈ ముఠా ఆన్లైన్ మోసాలకు కూడా పాల్పడుతోంది. ఇటీవల సైబరాబాద్లో ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించిన ముఠా సభ్యుడు ఆమె నుంచి భారీగా డబ్బులు దండుకుని మోసం చేశాడు.
ఈ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో వారి నివాసంలో సోదాలు చేపట్టగా మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. 10 మంది నైజీరియన్లతో పాటు ముగ్గురు మహిళలను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. వీరందరినీ పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకురానున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు - ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
శుక్రవారం తెల్లవారుజామున నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొన్న ఇంద్రపాలనగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
జూనియర్ ఆర్టిస్ట్కు వేధింపులు
హైదరాబాదులోని వనస్థలిపురంలో ఓ జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేధించిన ఆర్టీసీ డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.