పార్లమెంట్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ కు శభవార్త చెప్పిన ఈసీ..!!
హైదరాబాద్ : అదికార గులాబీ పార్టీకి శరాఘాతంలా పరిణమించిన ఆ ఎన్నికల గుర్తు పై కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఆ గుర్తు వల్ల తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్తితులను ఎదుర్కోవడమే కాకుండా కొన్ని చోట్ల ఓటమి అంచుకు చేరుకుంది. మరి కొన్ని నియోజక వర్గాల్లో భారీ మెజారిటీతో గెలుస్తారనుకున్న అభ్యర్ధులు నామమాత్రపు మెజారిటీతో గెలిచారు. దీంతో చావు తప్తి కన్నులొట్టబోయినంత పనైంది అదికార పార్టీకి. ఇదే పరిస్తితి ముందుముందు కొససాగితే సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి సమస్య గురించి ప్రస్తావించి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.
తెలంగాణలో అదికార టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తు తో పాటు ఇస్త్రీ పెట్టె గుర్తును ఫ్రీ సింబల్ నుండి తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్నయం తీసుకోవడంతో గులాబీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తుతో ఉన్న గుర్తులవల్ల తీవ్రంగా నష్టపోయామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావ్రుత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తాము చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ నేతలు ఈటెల రాజేందర్, జీ.వినోద్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా వారు కేంద్ర ఎన్నికల సంఘానికి క్రుతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా కారు గుర్తు బ్యాలెట్ లో ఒత్తుగా కనిపించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.