వికలాంగ బిచ్చగత్తె ఔదార్యం..కరోనా సమయంలో లాక్ డౌన్ సిబ్బందికి అరటిపండ్లు , మజ్జిగ పంపిణీ
కోట్లకు పడగలెత్తినా అందరూ గొప్ప మనసు కలిగి ఉండాలని లేదు . ఎవరికైనా కష్టం వస్తే , అవసరం అనుకుంటే స్పందించే గొప్ప మనసు మాత్రం కొందరికే ఉంటుంది. వందల కోట్ల ఆస్తులు ఉన్నా ఎంగిలి చేత్తో కాకిని తోలని వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో ఓ యాచకురాలు తన విశాల హృదయాన్ని ప్రదర్శించింది . కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ కరోనాని నియంత్రించటం కోసం విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి తనకు వచ్చే పించన్ డబ్బులతో పాటుగా , ప్రజల నుండి యాచన చేయగా వచ్చిన దానితో అరటిపండ్లు , మజ్జిగ ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది .
విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆసరా అందించిన యాచకురాలు
భిక్షాటన చేస్తూ కూడబెట్టిన సొమ్ముతో పాటు తనకు ప్రభుత్వం నుండి అందుతున్న ఆసరా డబ్బుతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు తన వంతు ఆసరా అందించింది ఒక యాచాకురాలు . పోలీసులకు, వైద్య సిబ్బందికి అరటిపళ్ళు, మజ్జిగ పంపిణీ చేసింది . లాక్ డౌన్ కారణంగా భార్యా బిడ్డలను వదిలేసి ప్రజల బాగు కోసం కష్టపడుతున్న వారి కోసం ఎంత చేసినా తక్కువేనని భావించిన బిచ్చగత్తె ఔదార్యం చూపించింది .
అశ్వారావుపేటలో అరటిపళ్ళు , మజ్జిగ పంపిణీ చేసిన దుర్గా భవాని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వైద్య సిబ్బంది, పోలీసులు, పంచాయతీ కార్మికులు ప్రాణాలకు తెగించి అహర్నిశలు కష్ట పడుతున్నారు. వారు చేస్తున్న సేవలను చూసి తన వంతు సాయాన్ని అందించాలి అనుకొంది దుర్గా భవాని అనే యాచకురాలు. అతి కష్టం మీదే తన జీవనాన్ని వెళ్ళబుచ్చే దుర్గాభవాని సాయం చేసే మనసుకు హ్యాట్సాఫ్ అంటున్నారు స్థానిక ప్రజలు . పక్షవాతం వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయి, మాట కూడా సరిగా రాని ఆ మహిళ ప్రతిరోజు రోడ్డుపై భిక్షాటన చేసేది. రోడ్డుపై వెళ్లేవారు వేసే భిక్షంతో కడుపు నింపుకునేది.
యువకుల సహాయంతో ఆటోలు మాట్లాడి అరటిపళ్ళు , మజ్జిగ పంపిణీ
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడుక్కునే పరిస్థితి కూడా లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు పవన్ కళ్యాణ్ సేవాసమితి సభ్యులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారు. తన కడుపు నిండటంతో ఆమె కూడా తన వంతు పది మందికి సహాయం అందించాలని భావించింది . ఈ నేపథ్యంలోనే తాను కూడా ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులకు చేతనైన సాయం చేయాలని, కొందరు యువకుల సహాయంతో ఆటోలు మాట్లాడి తన రెండు నెలల పెన్షన్ డబ్బులను, భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను మొత్తం ఆరు వేల రూపాయలను వెచ్చించి అరటిపళ్ళు కొనుగోలు చేసింది.
Recommended Video
కరోనా కష్ట కాలంలో యాచకురాలు స్పందించిన తీరు అందరికీ ఆదర్శం
ఎండాకాలం కావటంతో వారికి మజ్జిగ కూడా అందించాలని భావించి మజ్జిగను కూడా వారందరికీ తానే స్వయంగా అందించింది . దీంతో ఒక నిరుపేద యాచకురాలికి ఉన్న గొప్ప మనసుకు అందరూ జేజేలు పలుకుతున్నారు. సహాయం చెయ్యటానికి బాగా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు సహాయం చెయ్యాలనే గొప్ప మనసు ఉండాలని మరోమారు ఈ యాచాకురాలు నిరూపించింది. కరోనా కష్ట కాలంలో ఆమె స్పందించిన తీరు అందరికీ ఆదర్శం అని భావించటం ఏ మాత్రం తప్పు కాదు .