బేగంపేట్ మెట్రో స్టేషన్కు తాళాలు: ప్రగతి భవన్ ముట్టడి ఎఫెక్ట్: ప్రయాణీకులు బేజార్..!
ఇది ఒక అనూహ్య పరిణామం. ప్రతీ క్షణం ప్రయాణీకులతో కిటకిటలాడే మెట్రో స్టేషన్ కు తాళాలు వేసారు. అందునా నిత్యం రద్దీగా ఉండే స్టేషన్ కావటంతో ప్రయాణీకులు బేజార్ అవుతున్నారు. ఒక వైపు ఆర్టీసీ సమ్మె..మరో వైపు ఈ రోజు నుండే విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం..మరో వైపు వర్షం ఎఫెక్ట్...దీంతో ఉదయం నుండి మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే, స్టేషన్ కు వచ్చిన ప్రయాణీకుల కు అక్కడ ఊహించని సీన్ కనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్ కు కూత వేటు దూరంలో ఉండే బేగంపేట మెట్రో స్టేషన్కు అధికారులు తాళం వేశారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ సోమవారం చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో.. నిరసన కారులు స్టేషన్లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్లో నోటీసు అంటించారు.
ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అనేక మంది సీనియర్లు ఇంటి నుండి బయటకు రాకుండా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ కు వచ్చే ప్రతీ రోడ్డు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
అయితే, ప్రగతి భవన్ కు దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్ లో ప్రయాణీలకు అనుమతి ఇస్తే ప్రయాణీకుల మాదిరి కాంగ్రెస్ నేతలు..కార్యకర్తలు అక్కడకు వచ్చే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ పోలీసులు అంచనా వేసారు. దీంతో..తాత్కాలికంగా ప్రయాణీకులకు ఇబ్బంది అయినా పోలీసులు చర్యలు తీసుకోక తప్పటం లేదని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాత్రి నుండి అందుబాటులో లేరు.
ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారని చెబుతున్నా.. ఆయన పోలీసుల అదుపులో లేరని చెబుతున్నారు. ఇక, బేగంపేట పరిసర ప్రాంతాల్లో ప్రయివేటు..కార్పోరేట్ కార్యాలయాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడకు చేరుకోవాలంటే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఏకంగా మెట్రో స్టేషన్ కు తాళాలు వేయటం పైన ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.