జైపాల్ రెడ్డి..తెలంగాణ ఉద్యమంలో కనిపించని హీరో: ఆయన త్యాగం తెరవెనుకే..శాశ్వతంగా!
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కనిపించని హీరో జైపాల్ రెడ్డి. ఉద్యమానికి దశ-దిశను చూపారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన బాటను పరిచారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కల సాకారం కావడంలో జైపాల్ రెడ్డి చేసిన కృషి, త్యాగం.. తెర వెనుకే ఉండిపోయింది. మనదేశ పార్లమెంటరీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. విలువలతో కూడిన రాజకీయాలను చేశారు. రాజకీయలలో విలువల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస వరకు నిలిచారు.
ఎందరో యోధులు తెర ముందు కనిపించినా..
ఎందరో పోరాట యోధులు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ప్రొఫెసర్ కోదండరామ్ల సారథ్యంలో ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడూ సాధ్యం కాదు అనే సూత్రానికి లోబడి వారిద్దరూ ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమాగ్నిని నరనరాన జ్వలింప జేశారు. తెలంగాణ సమాజంలో దాదాపు ప్రతి వర్గాన్నీ వారు కదిలింపజేశారు. ప్రత్యేక తెలంగాణ కల నెరవేరడంలో విద్యార్థులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. రోడ్డెక్కారు. ధర్నాలు చేశారు. రోజుల తరబడి ఆందోళలను నిర్వహించారు. తెలంగాణను స్తంభింపజేసి, ఎట్టకేలకు తమ ఆశలను ఫలింపజేసుకున్నారు.
జైపాల్ రెడ్డి పాత్ర ఎంత?
తెలంగాణ కోసం ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలు, ఉద్యమ నేతలు చేసిన పోరాటాలు ఒక ఎత్తయితే.. తెర వెనుక ఉండి తెలంగాణ కోసం పావులు కదిపిన ఘనత జైపాల్ రెడ్డిది. తెలంగాణ అంటే ఒంటికాలిపై లేచే సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను ఒప్పించడానికి జైపాల్ అసమాన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారని అంటుంటారు ఆయన సన్నిహితులు. ఓ దశలో ఆయన స్వపక్షంలో విపక్షంలా మారారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలు శతృవుల్లా చూస్తున్నా పట్టించుకోలేదు. ఉక్కు మహిళగా పేరున్న సోనియాగాంధీని ఒప్పించగలిగారు. ట్రబుల్ షూటర్గా పేరున్న ప్రణబ్ ముఖర్జీని ఢీ కొట్టారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆయన ప్రణబ్ ముఖర్జీ వంటి కీలక నేతలతో చాలా సందర్భాల్లో వాదులాటకు దిగారు.
మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు గానీ..
నిజానికి రాజకీయంగా జైపాల్ రెడ్డిలో ఉన్నది కాంగ్రెస్ రక్తం కాదు. ఆయన జనతాపార్టీ నేత. ఆ పార్టీ ముక్కలైన తరువాత కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్కు చుక్కానిలా మారారు. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని గానీ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్న గానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెబుతుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2004లో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని జైపాల్ రెడ్డి వ్యతిరేకించారు కూడా. టీఆర్ఎస్తో పొత్తు వల్ల రాజకీయంగా ఎంతమాత్రమూ ఉపయోగం ఉండబోదని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పట్లో స్పష్టం చేశారు. ఫలితంగా- తెలంగాణ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. సమైక్యవాది అనే అపవాదును మూటగట్టుకున్నారు.
ఉద్యమం చివరి అయిదేళ్లలో కీలకం
ఉద్యమం చివరి అయిదేళ్ల కాలంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తన సొంత రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను గ్రహించారు. ప్రజల కంటే పార్టీ గొప్పది కాదని గుర్తించారు. విద్యార్థుల ఆత్మహత్యలతో అట్టుడుకుతున్న పరిస్థితుల్లో తెలంగాణ సాధన ఒక్కటే ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చుతుందని భావించారు. క్రమంగా- తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు అధిష్ఠానానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో జైపాల్ రెడ్డి.. తన తోటి లోక్సభ సభ్యుడు మధుయాష్కీ గౌడ్ సహకారాన్ని తీసుకున్నారు.
నిఖార్సయిన జాతీయ నేత..
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలంటూ స్వరాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. జైపాల్ రెడ్డి అంగీకరించలేదు. దీనికి కారణం.. జాతీయ నేతగా ఆయనకు గుర్తింపు ఉండటమే. తెలంగాణ కోసం పార్టీలో అంతర్గతంగా జైపాల్ రెడ్డి సాగిస్తున్న పోరాటాన్ని దగ్గరుండి చూసిన నాయకులు.. ఉద్యమానికి సారథ్యం వహించాలని సూచించినప్పటికీ ఆయన అంగీకరించలేదు. ఈ ఉద్యమాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రత్యర్థులు జాతీయ నేతగా ఉన్న తనను ప్రాంతీయ భావాలు ఉన్న నాయకుడిగా చిత్రీకరిస్తారనే ఆవేదన ఉండేదని సన్నిహితులు తెలిపారు. ఈ ఒక్క కారణంతోనే ఆయన తెలంగాణ ఉద్యమానికి పార్టీ తరఫున సారథ్యం వహించలేకపోయారని అన్నారు.
తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్న సోనియా, మన్మోహన్లతో పోరు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వాలి? దాని వల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలేంటీ? అని కాంగ్రెస్ లెక్కలు వేసుకుందే గానీ.. ప్రజల మనోభావాలను గౌరవించలేదు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పెద్దలను ఒప్పించడానికి జైపాల్ రెడ్డి అసామాన్య పోరాటాన్ని చూపారు. సొంత పార్టీలోనే విపక్షంలా మారారు. ప్రత్యేకించి- ప్రణబ్ ముఖర్జీని ఒప్పించడం జైపాల్ రెడ్డి చూపిన తెగువకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
దిగ్విజయ్ సింగ్ను ఇన్ఛార్జిగా రప్పించడంతో సగం విజయం..
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ను రప్పించడం వెనుక జైపాల్ రెడ్డి కృషి చాలా ఉంది. అప్పటికే- మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు దిగ్విజయ్ సింగ్. అలాంటి అనుభవం ఉన్న నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించడం వెనుక జైపాల్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తరువాతే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకున్న విషయం తెలిసిందే.