తస్మాత్ జాగ్రత్త, బెజవాడ 'కాల్మనీ'వాళ్లొస్తున్నారు: బాబుపై కెసిఆర్, అమరావతికే దిక్కులేదు
హైదరాబాద్: ఓటుకు నోటు, చంద్రబాబు అంశం గురించి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు విలేకరుల సమావేశంలో స్పందించారు. చంద్రబాబు, ఆ కేసు (ఓటుకు నోటు) గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశం పైన చురకలు అంటించారు. కాల్ మనీ సృష్టికర్తలే ఓట్ల కోసం హైదరాబాద్ వచ్చారని చంద్రబాబును ఉద్దేశించి చురకలు అంటించారు. హైదరాబాద్ ప్రజలూ! తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
స్మార్ట్ సిటీలు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు ఉపయోగపడవని చెప్పారు. వంద కోట్ల రూపాయలు ఎటు సరిపోతాయన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత.. టిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఓ విలేకరి ప్రశ్నించగా, కెసిఆర్ మాట్లాడుతూ.. దాని గురించి తన వద్ద సమాచారం లేదని చురక అంటించారు.
కెటిఆర్ వారసుడంటే.. ప్రజలు నిర్ణయిస్తారు
కెసిఆర్ వారసుడు కెటిఆర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. అది మనం నిర్ణయించేది కాదన్నారు.
హైదరాబాదులో ఐసిస్ పైన స్పందిస్తూ..
హైదరాబాదులో సంఘ వ్యతిరేకుల ఆటలు సాగనివ్వమని చెప్పారు. పోలీసులకు ఆధునాతన వాహనాలు ఇస్తామని, సిసి కెమెరాలు పెడతామని చెప్పారు. ఉగ్రవాదుల, తీవ్రవాదుల చర్యలు సాగనివ్వమన్నారు. శాంతిభద్రతలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడమని చెప్పారు.
చంచల్ గూడ జైలును చర్లపల్లికి తరలిస్తామని, పాతబస్తీలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం తీరు తెలంగాణ ప్రజల మనసు గాయపర్చే విధంగా ఉందన్నారు. పాఠశాల విద్యా కమర్షియల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కంటే ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగిందని, విపక్షాలు చెబుతున్నట్లు విద్యుత్ వినియోగం తగ్గలేదన్నారు. తమ పాలనలో అన్ని మతాలు సమానమని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
తెరాస మాటల పార్టీ, చేతల పార్టీ అని విపక్షాలు చెబుతున్నాయని.. ఎందుకో చెప్పాలన్నారు. చంద్రబాబు అమరావతికే దిక్కులేదని, అలాంటిది హైదరాబాదుకు నిధులు తెస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు రావడం వృథా అన్నారు.