30రోజుల్లోనే: పౌరసత్వంపై చెన్నమనేని ట్విస్ట్, హైకోర్టుకు, 'అప్పుడు వదిలేశారుగా'
భారత పౌరసత్వం రద్దుపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: భారత పౌరసత్వం రద్దుపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
చదవండి: భారత పౌరుడు కాదు: చెన్నమనేనికి కేంద్రం షాక్, స్పందన, ఏం జరిగింది?
సుప్రీం కోర్టు ఆదేశానుసారం విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ రమేశ్ భారత పౌరసత్వం చెల్లదని పేర్కొన్న విషయం తెలిసిందే.
పౌరసత్వం వదులుకోవాలని కేంద్రం
ఈ మేరకు భారత పౌరుడిగా అనుభవిస్తున్న ప్రయోజననాలు, అధికారాలను ఉపసంహరించుకోవాలని చెన్నమనేనికి ఆదేశించింది. ఆగస్టు 31 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
ప్రతివాదులుగా వీరే
భారత పౌరసత్వ చట్టం - 1955లోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లను చేర్చారు.
30 రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలి
తనకు భారత పౌరసత్వం ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఏకపక్ష నిర్ణయం
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో తనపై పోటీ చేసి ఓడిపోయిన బిజెపి అభ్యర్థి ఆది శ్రీనివాస్ తనపై చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేసినా దానిపై కేంద్ర శాఖ స్పందించిందని ఆ పిటిషన్లో తప్పుబట్టారు. అంతేకాకుండా, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆది శ్రీనివాస్
అంతకుముందు, ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పౌరసత్వం చెల్లనందున చెన్నమనేని రమేశ్ తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలనికోరుతూ కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
దేశ సేవ పేరుతో మొసలి కన్నీరు
దేశానికి సేవ చేయనివ్వట్లేదని మొసలి కన్నీరు కారుస్తున్న చెన్నమనేని గతంలో పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో చెప్పాలన్నారు. చట్టాలను తప్పుదోవ పట్టించి చట్టసభల్లో కూర్చోవడం సరికాదన్నారు. 2009 ఎన్నికలకు సంబంధించి తాను కోర్టును ఆశ్రయించానని, న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు.