ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్.. అప్పు తీర్చమని వేధింపులు, విద్యార్థి బలవన్మరణం
హైదరాబాద్ : బెట్టింగ్ నిలువనీడ లేకుండా చేస్తోంది. చేతిలో ఉన్న నగదే గాక అప్పు చేసి దివాళా తీసేవారు చాలా మంది ఉన్నారు. అమాయకులను మోసం చేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు కొత్త పంథాను ఎంచుకుంటారు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఏ జట్టు గెలుస్తోంది ? ఏ ఆటగాడు సెంచరీ చేస్తారు ? బౌలర్ వికెట్లు తీస్తారా అనే అంశాలపై బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకుంటున్నారు యువత. హైదరాబాద్లో ఓ యువకుడు కూడా బెట్టింగ్ పెట్టి అప్పు చేసి, తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
చదువుకొమ్మంటే ..
బోరబండకు చెందిన రవికుమార్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి కార్పెంటర్గా పనిచేస్తుండగా .. తల్లి ఆస్పత్రిలో డ్యూటీ చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కుమారుడిని చదివిస్తున్నారు. రవి చదువు కోసం ఊళ్లో ఉన్న ఇల్లు కూడా అమ్మారు. అయితే కాలేజీకి వెళ్లి చదువుతున్న రవి ... చదువుతోపాటు బెట్టింగ్కు కూడా చేస్తున్నాడు. దీంతో తాహతుకు మించి బెట్టింగ్ చేసి అప్పుల పాలయ్యాడు. చదువుకునే వయస్సులోనే అప్పలు చేయడం .. తీర్చేందుకు ఇబ్బందులు పడ్డాడు. అలా దాదాపు రూ.80 వేల వరకు అప్పుచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అప్పు తీర్చలేక ..
బెట్టింగ్ కాసిన రవి ఓడిపోవడంతో అప్పుచేసిన డబ్బును తీర్చాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో .. అప్పు తీర్చేందుకు ఇబ్బంది పడ్డాడు. చేసింది వేలల్లో కాబట్టి పేరెంట్స్కు చెప్పలేక మదనపడ్డాడు. కానీ అప్పిచ్చిన వారు వదలడం లేదు. ముఖ్యంగా బుకీ రాజశేఖర్ వేధింపులు ఎక్కువయ్యాయి. తరచూ ఫోన్ చేసి టార్చర్ పెట్టేవాడు. దీంతో తన తండ్రికి రోడ్డుప్రమాదం జరిగిందని అబద్దం చెప్పాడు. రూ.50 వేలు కావాలని అడిగితే .. ఊళ్లో ఉన్న పొలం అమ్మీ మరీ డబ్బులు తీసుకొచ్చారు. రూ.50 వేలు రవికి ఇస్తే అందుల్లోంచి రూ.40 వేలు రాజశేఖర్కు ఇచ్చినట్టు తెలిసింది. మిగతా రూ.10 వేల గురించి సమాచారం లేదు. సూసైడ్ నోట్లో ఫ్రెండ్స్, రాజశేఖర్ గురించి మాత్రమే రాశాడు రవి.
వేధింపులు తాళలేక
వడ్డేరబస్తీలో ఉండే రాజశేఖర్ తమ కుమారుడిని వేధించాడని పేరెంట్స్ చెప్తున్నారు. శనివారం డ్యూటీకి వెళ్లానని అతని తల్లి తెలిపారు. మధ్యాహ్నం భోజనం చేయమని చెప్పి వెళ్లానని .. తిరిగి ఇంటికొచ్చేసరికి ఉరేసుకొని చనిపోయాడని వాపోయారు. తమకు పట్టిన గతి మరేవరికి పట్టొద్దని అంటుంది ఆ తల్లి. తమ కుమారుడిని నమ్మామని .. మంచిగా చదువుకుంటున్నాడని భావిస్తే మమ్మల్ని ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయాడని రోదించారు. అప్పుతీసుకొచ్చి చదివించామని ... ఇంకా చదివించేవారమని చెప్తున్నారు. కానీ బెట్టింగ్ ముఠా తమ కుమారుడిని బలి తీసుకుందని రోదించారు.