హుజూర్ నగర్ ఫలితంపై బెట్టింగ్ ల జోరు: కాయ్ రాజా కాయ్ అంటున్న బెట్టింగ్ రాయుళ్ళు
తెలంగాణలో కీలకమైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. కానీ నువ్వా నేనా అంటూ సాగిన పోరాటంలో గెలుపు ఎవరిది అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తుంది. ఇక ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది అని చెప్తున్నాయి. అయినా సరే ప్రజల్లో అధికార టీఆర్ ఎస్ మీద వ్యతిరేఖత ఉందని, అది కాంగ్రెస్ కు లాభిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ సైతం ధీమా వ్యక్తం చేస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా మారనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ అటు కాంగ్రెస్ కు,ఇటు టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకం కావటంతో ఈ స్థానంపై పెద్ద ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయని సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట హుజూర్ నగర్
తెలంగాణలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి విలక్షణత ఉంది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక్కసారి కూడా గులాబీపార్టీ ఇక్కడ జెండా ఎగురవెయ్యలేదు. నియోజక వర్గం ఏర్పడిన 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ నుండి బరిలోకి దిగిన దొడ్డ నర్సయ్య విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తన హవా చూపించింది. 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట హుజూర్ నగర్ అని ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను బట్టి తెలుస్తుంది.
ఉపఎన్నిక పోలింగ్ తర్వాత టీఆర్ఎస్ దే హవా అని తేల్చిన ఎగ్జిట్ పోల్స్
ఇప్పుడు ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ లో అధికార టీఆర్ఎస్ జెండా ఎగరాలని శతవిధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె కాస్త హుజూర్ నగర్ ప్రచారానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించింది. అయినప్పటికీ పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా వచ్చాయి.
చాణక్య ఎగ్జిట్ పోల్లో టీఆర్ఎస్ కు 53 శాతం, కాంగ్రెస్ కు 41 శాతం, టీడీపీకి 2.1 శాతం, బీజేపీకి 1.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆరా సర్వేలో టీఆర్ఎస్ కు 50.48 శాతం, కాంగ్రెస్ కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు పోల్ అవుతాయని పేర్కొంది. వీసీపీ టీఆర్ఎస్ కు 57.73 శాతం, కాంగ్రెస్ కు 41.04 శాతం, టీడీపీకి 2.21 శాతం, బీజేపీకి 1.17 శాతం, ఇతరులకు 1.84 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక ఈ అంచనాలు రాక ముందే మంత్రి కేటీఆర్ తమ పార్టీ గెలుపు ఖాయమని ట్వీట్ చేశారు.
హుజూర్ నగర్ ఫలితంపై ఉత్కంఠ... జోరుగా బెట్టింగ్స్
అయితే ఇప్పటి వరకు హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ విషయాన్ని పక్కన పెడితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో విజయం ఎవరిని వరిస్తుంది అన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ పెట్టారని సమాచారం.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావటం, టీఆర్ఎస్ మొదటి నుండి ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోవటం, ఇక ఈ సారి చాలా ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించటం, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వంటి అనేక కారణాలు హుజూర్ నగర్ ఉప ఎన్నికపై అందరిలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితంపై మునుపెన్నడూ లేని విధంగా కాయ్ రాజా కాయ్ అంటున్నారు బెట్టింగ్ రాయుళ్ళు .
తెలంగాణాలోనూ , ఏపీలోనూ కాయ్ రాజా కాయ్
హుజూర్ నగర్లో ఉప ఎన్నిక గెలుపుపై స్థానికుల్లో సైతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలు పందెం వేసుకునే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న జనం గెలుపుపై లక్షల రూపాయల బెట్టింగ్ లకు దిగుతున్నట్టు తెలుస్తుంది. హుజూర్ నగర్ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా కావడంతో కృష్ణా, గుంటూరు, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లా వాసులు కూడా చాలా మంది హుజూర్ నగర్ ఉపఎన్నికల గెలుపోటములపై దృష్టిసారించారు. ఇటు తెలంగాణాలోనే కాకుండా అటు ఆంధ్రా లో కూడా హుజూర్ నగర్ ఫలితంపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. కులాలు,సామాజిక వర్గాల వారీగా ఓట్లను విభజిస్తూ ఆయా పార్టీలు సామాజిక వర్గాలపై అంచనాలు వేసి మరీ బెట్టింగ్ పెడుతున్నట్టు సమాచారం.
ఫలితాల కోసం నిరీక్షిస్తున్న బెట్టింగ్ రాయుళ్ళు
ఇక ఈ బెట్టింగ్ ల వ్యవహారాలపై నిఘా వర్గాలు సైతం ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు తెలుస్తుంది . తెలంగాణా రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల నేపధ్యంలో సాగిన పోలింగ్ పై ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బెట్టింగ్ పెట్టిన బెట్టింగ్ రాయుళ్లంతా ఫలితంకోసం అక్టోబర్ 24 తేదీ కోసం వేచి చూస్తున్నారు. మరి రానున్న ఫలితాలు బెట్టింగ్ రాయుళ్ళకు ఎవరికి మోదాన్ని ఇస్తాయో.. ఎవరికి ఖేదాన్ని మిగులుస్తాయో, ఏ పార్టీకి పట్టం కడతాయో తెలియాలంటే ఈ రెండు రోజులు ఆగాలి .