తస్మాత్ జాగ్రత్త : బొగ్గుల కుంపటితో వెచ్చగా ఉంటున్నారా?.. అది మీ ప్రాణాలకే ప్రమాదం తెలుసా..!
హైదరాబాద్ : చలిపులికి భయపడుతున్నారా? గజగజ వణుకుతూ బొగ్గు కుంపట్లను పెట్టేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. బొగ్గు కుంపట్లు ప్రాణాలు తీస్తున్నాయి. జీవితాలను చిదిమేస్తున్నాయి. అవును ఇది ముమ్మాటికీ నిజం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు ఈ విషయం తేటతెల్లం చేస్తున్నాయి.
చలికాలం అంటే అందరికీ వణుకే. అలాగని చలి నుంచి కాపాడుకోవటానికి.. గదుల్లో బొగ్గుల కుంపటి పెడితే మొదటికే మోసం. వెచ్చదనం ఇవ్వడం మాట అటుంచితే.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సందర్భాలున్నాయి.
బొగ్గుల కుంపటి వెచ్చదనం.. ప్రాణాలతో చెలగాటం
చలికి భయపడి బొగ్గుల కుంపటితో వెచ్చదనం ఆస్వాదిస్తుంటే.. ఇకపై దానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. చలి నుంచి రక్షణ కోసం గదుల్లో బొగ్గుల కుంపటి పెట్టడం మానేయండి. అవి చలి నుంచి రక్షించడం ఏమో గానీ.. స్లో పాయిజన్ గా మారుతున్నాయి. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తల్లీకొడుకులను పొట్టన పెట్టుకుంది బొగ్గుల కుంపటి.
తాజాగా మేడ్చల్ జిల్లా బొమ్రాస్పేట్ లోని ఓ కోళ్లఫామ్ లో పనిచేస్తున్న నలుగురు యువకులు చనిపోవడం కలకలం రేపింది. మొదట ఎన్నో అనుమానాలు వ్యక్తమయినా.. చివరకు బొగ్గుల కుంపటే వారి మృతికి కారణమని తేలింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు నిద్రిస్తున్న గదిలోకి గాలి రాకుండా ప్లాస్టిక్ సంచులు కట్టుకున్నారు. దాంతోపాటు బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు. అయితే నిద్రలోకి జారుకున్నాక పొగబారుతున్న విషయం గుర్తించలేకపోయారు. దీంతో తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నా.. వెలుగు చూడని పరిస్థితి. ఇలా నిద్రలోనే చనిపోతుండటం వెనుక ఆరోగ్య సమస్యలు ఉండొచ్చేమోనని భావిస్తున్నారే తప్ప.. బొగ్గుల కుంపటి కారణమని గుర్తించలేకపోతున్నారు.
బొగ్గులోని కార్బన్ + గాలిలోని ఆక్సిజన్ = ప్రాణాలకు ముప్పు
చలికి భయపడి చాలామంది తాము నిద్రిస్తున్న గదిలోకి ఏమాత్రం గాలి చొరబడకుండా కిటికీలు, తలుపులు మూసేసి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలాంటి చోట్ల బొగ్గుల కుంపటి పెడితే మోస్ట్ డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు. బొగ్గులోని కార్బన్ తో గాలిలోని ఆక్సిజన్ కలిసి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అలా కొద్ది సమయం తర్వాత కార్బన్ డై ఆక్సైడ్ లోని కొద్దోగొప్పో ఆక్సిజన్ ను సైతం బొగ్గుల కుంపటి లాగేస్తుంది. దీంతో కార్బన్ మోనాక్సైడ్ రిలీజవుతుంది. ఇది మోస్ట్ డేంజరస్ టాక్సిక్ గ్యాస్.
కార్బన్ మోనాక్సైడ్ కు ఎలాంటి వాసన గానీ, కలర్ గానీ ఉండదు. దీంతో గుర్తించడానికి వీలుపడదు. దీన్ని నాలుగైదు సార్లు పీల్చుకుంటే చాలు నిద్రలోనే ప్రాణాలు పోతాయి. ఒకరకంగా ఇది సైలెంట్ కిల్లర్. గుండె, మెదడుకు మెల్లమెల్లగా చేరుకునే కార్బన్ మోనాక్సైడ్ కొద్ది క్షణాల్లోనే గుండె మీద ప్రభావం చూపిస్తుంది. గుండె నుంచి రక్తంలోకి చేరి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ను తయారుచేస్తుంది. ఇదంతా కూడా నిద్రపోతున్న వారికి ఏమాత్రం తెలియదు. తమ శరీరంలో జరుగుతున్న అంతర్గత మార్పులను ఏమాత్రం గుర్తించడానికి వీలుండదు. దీంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అలా బొగ్గుల కుంపటి పొగ.. మనుషుల జీవితాలను మసకబారుస్తోంది.
డేంజర్ బెల్.. సైలెంట్ కిల్లర్.. అవగాహన పెంచాలి
సైలెంట్ కిల్లర్ గా మారుతున్న బొగ్గుల కుంపట్లపై ప్రజల్లో అవగాహన తక్కువంటున్నారు వైద్య నిపుణులు. తెల్లారేసరికి ప్రాణాలు పోతుంటే.. ఏవో ఇతర సమస్యలు అనుకుంటున్నారే తప్ప బొగ్గుల కుంపట్లే కారణమని తెలుసుకోలేకపోతున్నారు. చదువుకున్నోళ్లు సైతం ఈ కార్బన్ + ఆక్సిజన్ లెక్కలు పట్టించుకోక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చిన్న లాజిక్ మిస్సవుతూ విలువైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. వెచ్చదనం కోసం ఆరాటపడుతూ బొగ్గుల కుంపటి మాటున దాగున్న డేంజర్ బెల్ గుర్తించలేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా బొగ్గుల కుంపటి రాజేస్తున్న చీకటి ప్రాణాల ముప్పు తెలుసుకోండి. మీతో పాటు పదిమందికి తెలిసేలా అవగాహన పెంపొందించండి.