ఇతనితో జాగ్రత్త!: హాస్టల్లో చేరుతానంటూ వచ్చి.. ల్యాప్టాప్లతో ఎస్కేప్!
దాదాపు 25 సంవత్సరాల వయసున్న ఓ గుర్తుతెలియని యువకుడు గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని బాయ్స్ హాస్టల్స్కు వెళ్లి చోరీలకు పాల్పడుతున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శశాంక్రెడ్డి పేర్కొన్నారు.
మాదాపూర్: బతకుదెరువు కోసమో.. చదువు కోసమో.. హైదరాబాద్ లాంటి మహానగరాలకు నిత్యం కొన్ని వేల మంది వలస వస్తుంటారు. విద్యార్థులు, బ్యాచిలర్స్ అయితే ఎక్కువగా హాస్టల్స్ లోనే ఉంటారు. వీళ్ల లాగే ఈజీ మనీ కోసం నగరం బాట పట్టేవారు కూడా చాలామందే ఉంటారు. హాస్టల్లో చేరుతామంటూ వచ్చి.. అదును చూసి చోరీలకు పాల్పడుతుంటారు.
ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న గుర్తు తెలియని నిందితుడిపై తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు 25 సంవత్సరాల వయసున్న ఓ గుర్తుతెలియని యువకుడు గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని బాయ్స్ హాస్టల్స్కు వెళ్లి చోరీలకు పాల్పడుతున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శశాంక్రెడ్డి పేర్కొన్నారు.
తొలుత హాస్టల్లో గది కావాలంటూ వచ్చే అతను.. ఎవరి కంటా పడకుండా.. అదును చూసి హాస్టల్లోని ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు తస్కరిస్తుంటాడని చెప్పారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన అతని చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. చిత్రంలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనబడితే వెంటనే పోలీసులకు 9490617186కు సమాచారం అందించాలని కోరారు.