సీతారాముల కల్యాణం చూతమురారండి!
భద్రాద్రి : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. రంగురంగుల పూలు, స్వాగత తోరణాలతో పెళ్లి వేడుకకు ముస్తాబైంది. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో అలంకరించిన పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది. సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామము, పూలజడ, బుగ్గన చుక్కతో వధువు సీతమ్మ తల్లి పెళ్లికి ముస్తాబయ్యారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు తరిలి వచ్చిన భక్తజనంతో భద్రాద్రి పులకించిపోతోంది.
భారీగా తరలివచ్చిన భక్తజనం
సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో భద్రాద్రి కళకళలాడుతోంది. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కల్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
కన్నుల పండుగగా జరగనున్న కల్యాణం
ఉదయం 10.30గం. తిరుకల్యాణ మహోత్సవంతో కల్యాణ క్రతువు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో రాములోరి పెండ్లి జరగనుంది. సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఈ నెల 6న వసంతపక్ష బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10న అంకురార్పణ, 11న ధ్వజపట భద్రక మండల లేఖనం, 12న ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట జరిగింది. శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా సాగింది.
మిథిలా స్టేడియంలో సర్వం సిద్ధం
జానకి రాముల కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 24 సెక్టార్లలో 35వేల మంది స్వామి వారి కల్యాణం తిలకించేందుకు అవకాశంఉంది. టికెట్ల ద్వారా 20వేల మందికి, గ్యాలరీ నుంచి 15వేల మంది ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. బయటకు వెళ్లేందుకు 20 అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో భక్తులు స్వామి వారి కల్యాణాన్ని చూసేందుకు 75 టీవీలు, 5 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 32 సీసీ కెమెరాల ద్వారా నిత్యం భధ్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం 40 కూలర్లు, 36 టన్నుల ఏసీలను 200 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.
సోమవారం శ్రీరామ పట్టాభిషేకం
సీతారాముల కల్యాణం మరుసటి రోజున నిర్వహించే శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని మిథిలా స్టేడియంలోనే నిర్వహించనున్నారు. వీవీఐపీ దర్శనం కోసం 250, వీఐపీ దర్శనం కోసం 100రూపాయల చొప్పున టికెట్లు విక్రయిస్తున్నారు. కల్యాణానికి వచ్చే భక్తులు సేద దీరేందుకు పలుచోట్ల తాత్కాలిక విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 3లక్షల లడ్డూలను సిద్ధం చేసిన దేవస్థానం.. 14 కౌంటర్ల ద్వారా వాటిని విక్రయించనున్నారు. కల్యాణం రోజునే లక్ష తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకోసం 34 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటుచేశారు.