భద్రాద్రి రామయ్యకు ‘ఇంటి’ పోటు: పూజారిపై సస్పెన్షన్ వేటు
అవును.. భద్రాద్రి రామయ్యకు ఇంటి పోటు పెరిగింది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామికి ‘ఇంటి పోటు’ ఏమిటని సందేహిస్తున్నారు కదూ.. అయితే, ఇదంతా చదవండి...
ఖమ్మం: 'దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు' అనే మాట మీరు వినే ఉంటారు. దీనర్థమేమిటి? దేవుడే కాదు.. పూజారి కూడా శక్తిమంతుడని, 'ఆం.. పూజారే కదా..' అని తీసిపారేయడానికి వీల్లేదనే కదా... దేవుడి ఇంటి(మందిరం)లో పూజారే సర్వస్వం. దేవుడిపట్ల భక్తిశ్రద్ధలున్న పూజారులతో భగవంతుడికి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండవు. కానీ, ఏ ఒక్క పూజారైనా స్వార్థపరుడిగా మారితే..? ఏం జరుగుతుంది? ఆ భగవంతుడికి 'ఇంటి పోటు' మొదలవుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. భద్రాద్రి శ్రీ సీతారాముల వారికి ఇప్పుడు ఇదే సమస్య ఎదురవుతోంది. గతంలో సీతమ్మ నగ, లక్ష్మణస్వామి లాకెట్ మాయమయ్యాయి. కొన్ని రోజుల తరువాత అంతుచిక్కని రీతిలో 'దొరికాయి'. దీనిపై విచారణ అటకెక్కింది. దోషులెవరో తేలలేదు. ఇటీవల, రామాలయం అనుబంధ ఆలయం తలుపులు మూయకుండా మరిచిపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా.. స్వామివారి మూలవరుల చిత్రాలు పత్రికల్లో, వాట్సప్ ద్వారా ప్రసార, సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.
అర్చకుడిపై సస్పెన్షన్ వేటు
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి మూలవరుల ఫొటోలను సెల్ ఫోన్లో తీసిన అర్చకుడిపై బుధవారం రాత్రి సస్పెన్షన్ వేటు పడింది. మూలవరుల ఫొటోలను ఎవరు, ఎలా, ఎప్పుడు తీశారన్న అంశంపై విచారణకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ) ప్రభాకర్ శ్రీనివాస్ ఆదేశించారు. విచారణాధికారిగా ఆలయ సూపరింటెండెంట్ భవాని రామక్రిష్ణను నియమించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా అర్చకుడు మదనమోహనాచార్యులును సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలా గుర్తించారు
గర్భగుడిలోని మూలవరులకు అలకరించేందుకని బంగారపు ఆభరణాలను బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు కొన్ని రోజుల కిందట సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు శుక్రవారాల్లో మాత్రమే మూలవరులకు అలంకరించారు. ఈ మూడు రోజుల్లో విధుల్లో ఉన్న అర్చకులను విచారణాధికారి భవాని రామక్రిష్ణ ప్రశ్నించారు. అంతేకాదు, ఈ మూడు రోజుల్లో చేసిన అలంకరణలను, వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన చిత్రాలను నిశితంగా పోల్చి చూశారు. ఆ ఫొటోలను ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) తీసినట్టుగా గుర్తించారు. ఆ రోజు విధుల్లో ఉన్న అర్చకుడు మదనమోహనాచార్యులే, సెల్ ఫోన్ ద్వారా ఆ ఫొటోలు తీసినట్టుగా గుర్తించారు.
వేటు పడింది
మూలవరుల ఫొటోలను అర్చకుడే చిత్రీకరించి, వాట్సప్ ద్వారా బయటకు పంపడాన్ని ఈఓ తీవ్రంగా పరిగణించారు. బుధవారం రాత్రి సస్పెన్షన్ వేటు వేశారు
మరో ఇద్దరికి సంజాయిషీ నోటీస్
అర్చకుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రధాన అర్చకుడు, మరో ముఖ్య అర్చకుడు బాధ్యతారహితంగా వ్యవహరించినట్టుగా భావించిన ఈఓ, వారిద్దరికి సంజాయిషీ నోటీస్ జారీ చేశారు.