రేపే రాములోరి లగ్గం.. శ్రీరామ నవమికి ముస్తాబైన భద్రాద్రి
Recommended Video
భద్రాచలం : భద్రాద్రి ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తలమునకలైంది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం ఆదివారం (14.04.2019) నాడు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే సోమవారం (15.04.2019) నాడు రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.
భద్రాద్రి రాములోరి గుడి విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. భద్రాచలంలోని ప్రధాన కూడళ్లతో పాటు మెయిన్ సెంటర్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు స్వామివారి వివాహ వేడుక జరగనున్న మిథిలా ప్రాంగణంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు వేయించారు. భక్తులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు.
ఓటరన్నకు కోపమొచ్చిందా?.. పోలింగ్ శాతం భారీగా ఎందుకు తగ్గింది?
భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు.. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. రెండు లక్షల మేర లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు ఆలయ అధికారులు. అంతేకాదు రాములోరి లగ్గం సందర్భంగా వినియోగించే ముత్యాల తలంబ్రాలను భక్తులకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేశారు.