సూరి హత్య కేసు: భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, పారిపోతాడని సిఐడీ
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ నాలుగు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీని పైన సోమవారం ఇరువైపుల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పును నాలుగు గంటలకు వెల్లడించింది. భాను పిటిషన్ను కొట్టి వేసింది.
తాను మూడేళ్లుగా జైలులో ఉన్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని భాను కిరణ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన సిఐడి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. భాను కిరణ్కు బెయిల్ వస్తే పారిపోతాడని చెప్పింది.
2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరి హత్యకు గురయ్యారు. ఆయన హత్య అనంతరం భాను కిరణ్ ఏడాదిన్నర పాటు పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. మూడేళ్లుగా అతను జైలులో ఉంటున్నాడు.
తాను బెయిల్ పైన బయటకు వస్తే మద్దెలచెర్వు సూరి అనుచరుల నుంచి తనకు ప్రాణహానీ ఉంటుందని భావించి అతను రెండుమూడు సార్లకు మించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇప్పుడు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ చుక్కెదురయింది.