భారత్ బంద్: స్తంభించిన రవాణా వ్యవస్థ, ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్: పలు డిమాండ్ల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన భారత్ బంద్ సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు బుధవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయి.
బంద్తో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వాణిజ్య కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి. దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే, లారీ, ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. సమ్మెకు రహదారి రవాణాసంస్థ, రైల్వే, ఆటో, లారీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆర్టీసీ బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెకు మద్దతు తెలిపారు. హైదరాబాద్లో ఆటోలు కూడా నడపక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణిలో 18 గనుల్లో కార్మికులు సమ్మెకు మద్దతుగా విధులు బహిష్కరించారు. దీంతో 45వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తనదైన శైలిలో స్పందించారు. సమ్మె ప్రభావం పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదని మంగళవారం దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్న మాటలో వాస్తవం లేదన్నారు.
భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్), ఎన్ఎఫ్టీయూలు సమ్మెకు దూరంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రెండు ప్రధాన కార్మిక సంఘాలు దూరంగా ఉంటున్న నేపథ్యంలో సమ్మె సంపూర్ణంగా ఎలా జరుగుతుందన్నారు. అయినా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న 12 అంశాల్లో 9 డిమాండ్లకు ఇప్పటికే సానుకూలంగా స్పందించామని ఆయన పేర్కొన్నారు.