తెలంగాణలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: ఏపీలో ఎదురుచూపులు, కరోనా కేసులు ఇలా
హైదరాబాద్: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీలో తెలంగాణలోని భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ సంస్థ ఆవిష్కరించిన 'కొవాగ్జిన్' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇందుకోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిమ్స్లో మంగళవారం(జులై 7) ప్రారంభమైంది.
షాకింగ్ : ఎంపీ సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్...
ఒక్కో వ్యక్తికి మూడు డోసులు..
ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్కు సమ్మతించిన వ్యక్తుల రక్త నమూనాలను నిమ్స్ సిబ్బంది సేకరించనున్నారు. ఆ రక్త నమూనాలపై వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి, ఆరోగ్యంగా ఉంటే వారం తర్వాత వారికి మొదటి డోస్ ఇస్తారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. ట్రయల్స్లో భాగంగా ఒక్కో వ్యక్తికి మూడు డోసులు ఇస్తామని, మొదటి డోస్ ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలోనే రెండ్రోజులు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. 14 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తామని వివరించారు.
ఏపీలో క్లినికల్ ట్రయల్స్ కోసం ఎదురుచూపులు
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభానికి తేదీ ఇంకా ఖరారు కాలేదు. క్లినికల్ ట్రయల్స్కు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం, అనుమతి కోసం విశాఖపట్నం కేజీహెచ్ అధికారులు ఎదురుచూస్తున్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఇటీవల కేజీహెచ్ను కూడా ఎంపిక చేసింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభానికి షెడ్యూల్ ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్ బాధ్యతను ఏఎంసీ ప్రొఫెసర్ వసుదేవ్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో జులై 7న కేజీహెచ్లో ఎఠిక్స్ కమిటీ భేటీ కానుంది. ఆస్పత్రిలో ఉన్న వసతులపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు.. దేశంలోనూ..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 25,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,646 యాక్టివ్ కేసులున్నాయి. 14,781 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 306 మంది మరణించారు. ఇక ఏపీలో 20,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,860 యాక్టివ్ కేసులున్నాయి. 8920 మంది కోలుకున్నారు. 239 మంది మరణించారు. మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో 7,21,344 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,60,835 యాక్టివ్ కేసులున్నాయి. 4,40,229 మంది కోలుకున్నారు. 20,184 మంది కరోనాతో మృతి చెందారు.