జానాతో పోల్చితే భట్టే మేలు .. సీఎల్పీ నేతగా సమర్థంగా వాదనలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. పార్టీ, అధినేత కేసీఆర్ పై ఒక్కరిద్దరూ తప్ప మిగతా నేతలంతా మాట్లాడేందుకు జంకుతారు. ఇక అసెంబ్లీలో అయితే వార్ వన్ సైడే. తొలి విడత సీఎల్పీ నేత జానారెడ్డి .. అధికార పార్టీకి విధేయుడిగానే ఉన్నారనే చర్చ బాహాటంగానే జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క మాత్రం అంతా మెతకకాదని .. బడ్జెట్ సెషన్ ద్వారా స్పష్టమైంది.
వాణి గట్టిదే ..
బడ్జెట్ సందర్భంగా జరిగిన చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన వాణిని వినిపించారు. ఇక సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా తానేంటో నిరూపించుకున్నారు. బడ్జెట్ లో లోపాలను ఎత్తిచూపారు. పదే పదే స్వయంగా సీఎం కేసీఆర్ కల్పించుకున్న .. వెనక్కి తగ్గలేదు. మాట్లాడనీయమని అంటూనే సందర్భోచితంగా నవ్వుతూ .. తన వాణి గట్టిదనే ప్రయత్నం చేశారు.
దబాయించకండి ..
మిషన్ భగీరథపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పదే పదే కల్పించుకున్నారు. ఈ సందర్భంగా విక్రమార్క .. దబాయించకండి అంటూ అన్నారు. బెదిరిస్తే బెదిరిపోవాలా అనే హావాభావాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. ఆ పదం వెనక్కి తీసుకోవాలని సూచించారు.
అన్ని అంశాలపై చర్చ
ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా కేవలం బిల్లు .. కేటాయింపులే కాకుండా ఇతర సమస్యలను లేవనెత్తారు. బిల్లులు కట్టాలని కోరడం, భూ రికార్డుల ప్రక్షాళనలో నెలకొన్న లోపాలు .. అంశాలవారీగా లేవనెత్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ వివరంగా సమాధానం తెలిపారు. ఇవే గాక ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, ఆర్మూర్ లో మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఆందోళనను కూడా ప్రస్తావించి .. తనకు స్పీకర్ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.