కేటీఆర్కు అది తప్ప... పరిపాలన రాదు... ప్రభుత్వంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు...
తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఇంగ్లీష్ మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. 'కేటీఆర్... మాట మాట్లాడితే హైదరాబాద్ విశ్వనగరం అంటుంటాడు.ఒకసారి ఉస్మానియా ఆసుపత్రి చూస్తే తెలుస్తుంది... నీ విశ్వనగరం మొత్తం' అని ఎద్దేవా చేసారు. ప్రజలు ఈ దుర్మార్గపు పాలనను వదిలించుకోవాలని అన్నారు. గురువారం హైదరాబాద్లో భట్టి మీడియాతో మాట్లాడారు.
జనం భయం గుప్పిట్లో.. కేసీఆర్ ఫామ్ హౌస్లో...
కరోనా విజృంభణతో కొద్ది నెలలుగా తెలంగాణ భయం గుప్పిట్లో బతుకుతుంటే సీఎం కేసీఆర్ ప్రజలను గాలికొదిలేసి ఫామ్ హౌస్కి వెళ్లిపోయారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు సరిపోవడం లేదని... frbm పరిధిని 5కి పెంచుకున్నారని భట్టి అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. Frbm పరిధి పెంపుతో రాష్ట్రం రూ.5లక్షల కోట్ల అప్పు నుంచి రూ.6 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేయబడుతోందని అన్నారు.
ప్రజారోగ్యం వదిలేసి.. కట్టడాలపై పడ్డ కేసీఆర్...
ఇప్పటి వరకూ చేసిన అప్పులు సరిపోవడం లేదని, మళ్లీ కొత్త అప్పుల కోసం ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి.. పోనీ ప్రజల ఆరోగ్యం పట్టించుకుంటున్నారా? అంటే అది కూడా లేదన్నారు. వైద్యం,ఆరోగ్యం,విద్యలను పూర్తిగా విస్మరించి కట్టడాలపై పడ్డారని విమర్శించారు. ఇప్పటివరకూ తెచ్చిన అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video
కేసీఆర్ వైఫల్యానికి అదే నిదర్శనం...
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కొత్త సచివాలయ పనుల నిర్మాణం తక్షణమే ఆపేసి,ఉస్మానియా ఆస్పత్రి అభివృద్దిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షానికే ఆస్పత్రిలో డ్రైనేజీ నీళ్లు పొంగి పొర్లడం కేసీఆర్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ తన మూఢ నమ్మకాల కోసం సచివాలయాన్ని కూల్చివేస్తున్నారన్నారు. కేసీఆర్ మాటలు పెద్దవని... ఆచరణ మాత్రం శూన్యమని మండిపడ్డారు. . కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చట్లేదని ప్రశ్నించారు.కరోనా విధుల్లో ఉన్న వైద్యులకు 50శాతం ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.