హీరో నితిన్కు షాక్: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ‘భీష్మ’ చిత్రం!, వెంటనే స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: కొత్త సినిమాల పైరసీకి వ్యతిరేకంగా సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు, నటీనటులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ.. పైరసీ మాత్రం తగ్గడం లేదు. సినిమాలు విడుదలైన రోజు లేదా ఆ తర్వాతి రోజే కొన్ని సైట్లలో ఆ సినిమాలు ప్రత్యక్షమవడంతో సినీ పరిశ్రమకు పెద్ద నష్టాన్నే కలిగిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సులో భీష్మ చిత్రం..
తాజాగా టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్-రష్మీక మందన నటించిన భీష్మ చిత్రం కూడా పైరసీ బారిన పడింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్తో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపడుతున్న విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం.
నితిన్ ఫ్యాన్ సమాచారంతో..
ఓ ప్రయాణికుడు బస్సులో ప్రదర్శించిన భీష్మ చిత్రానికి సంబంధించిన విషయాన్ని మొబైల్లో చిత్రీకరించి ట్విట్టర్ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు. దీంతో హీరో నితిన్ ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్లోని పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విభాగం ప్రతినిధులు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
సైబర్ క్రైం పోలీసుల దృష్టికి..
ఫిబ్రవరి 21న భీష్మ చిత్రం విడుదల కాగా, నాలుగు రోజులకే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిత్రం ఇతర మాధ్యమాలు, సోషల్ మీడియాలోకి విస్తరించకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను పైరసీ వ్యతిరేక విభాగం కోరింది.
వెంకీ కుడుముల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన కేటీఆర్..
కాగా, భీష్మ చిత్రాన్ని టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించారు కేటీఆర్. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కు సూచించారు.
Recommended Video
చిత్ర బృందం ఆందోళన..
గతంలో పలుమార్లు కూడా ఇలా ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించడం గమనార్హం. కాగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. హిట్ టాక్ రావడంతో మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇలా పైరసీకి గురికావడం వల్ల చిత్ర కలెక్షన్లు దెబ్బతింటాయని చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది.