సారీ సునీల్! సహోద్యోగుల శారీరక, మానసిక వేధింపులతో భెల్ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మృగాల అరాచకాలకు అమాయక మహిళలు, యువతులు బలవుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్-బీహెచ్ఈఎల్) ఉద్యోగిని సహోద్యోగులు, ఉన్నతాధికారుల లైంగిక వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. తన ఆత్మహత్యకు కారణమైన సహోద్యోుల పేర్లను కూడా తన సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
భర్త తనను విమానంలో తీసుకెళ్లలేదని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఉద్యోగరీత్యా నగరానికి..
పోలీసులు, బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన నేహచౌక్సీ(32), ఆమె భర్త సునీల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరానికి వచ్చారు. మియాపూర్లోని భాను టౌన్షిప్లో నివాసం ఉంటున్నారు. నేహ భెల్లో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తోంది.
నేహ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో..
కాగా, గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది నేహ. గురువారం మధ్యాహ్నం భర్త సునీల్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికి వచ్చాడు. విగత జీవిగా పడివున్న భార్యను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నేహ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శారీరక, మానసిక వేధింపులు భరించలేక..
‘నా చావుకు భెల్లో పనిచేసే డీజీఎం కిషోర్ అర్థకుమార్, తోటో ఉద్యోగులు స్వైన్, మోహన్లాల్ సోని, సుమలత, గోపిరామ్, నితిన్, సీతారామ్, చరణ్రాజ్ కారణం' అని నేహ తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. తాను భోపాల్ నుంచి జూన్లో బదిలీపై హైదరాబాద్కు వచ్చిన నాటి నుంచి వీరంతా తనను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వాపోయింది. అంతేగాక, తన ఫోన్ను ట్యాప్ చేసి తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో అభాండాలు సృష్టిస్తూ తన జీవితాన్ని నరకప్రాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
పండగను ఆనందంగా జరుపుకోవాలనుకున్నా..
తన ఉన్నతాధికారుల్లాంటి వారు ఉంటే మహిళలకు రక్షణ ఉండదని, ఈ విషయాలను ఎన్నోసార్లు హెచ్ఆర్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుని చేయలేకపోయానని వాపోయింది. భర్త, కుటుంబసభ్యులతో కలిసి తమ సంప్రదాయ పండగ కర్వాచౌత్ను ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్నా.. మెహందీ సిద్ధం చేసుకున్నా.. కానీ.. రేపటిని చూడలేకపోతున్నా.. అంటూ నేహ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.
సారీ సునీల్ అంటూ భర్తకు నిస్సాహాయంగా..
‘సునీల్.. నా మాట నిలబెట్టుకోలేకపోతున్నా.. వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాన్ని నెరవేర్చకుండానే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించు.. నా జీవితం నీతో ఆనందంగా గడుస్తుందనుకున్నా.. కొందరు దుర్మార్గులు నా జీవితాన్ని అంధకారంలోకి నెట్టారు. నాకు అనుక్షణం ప్రత్యక్షంగా, పరోక్షంగా నరకం చూపించారు' అంటూ నేహ తన నిస్సాయతను, ఆవేదనను వెల్లడించింది. అక్టోబర్ 14న తన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మియాపూర్ పోలీసుల సూచన మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆధారాలు లేవని వారు చెప్పారని తెలిపింది.