భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ హైదరాబాద్లో అరెస్ట్..
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా హైదరాబాద్లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(TISS)విద్యార్థులు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు ఆజాద్ నగరానికి వచ్చారు. అయితే నిరసన ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ లంగర్ హౌజ్ పోలీసులు ఆజాద్ను అదుపులోకి తీసుకున్నారు.IANS సమాచారం ప్రకారం.. చంద్రశేఖర్ ఆజాద్,ఆయన అనుచరులతో కలిసి మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి బయలుదేరారు. అక్కడ ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే మార్గమధ్యలోనే ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మాట్లాడుతూ.. నిరసన ర్యాలీకి అనుమతి లేదని, అందుకే సెక్షన్ 151 కింద ఆజాద్ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అయితే కొద్దిసేపట్లోనే ఆజాద్ను విడిచిపెట్టవచ్చునని కూడా తెలిపారు. అంజని కుమార్ చెప్పిన సెక్షన్ 151 ప్రకారం.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. ఆజాద్ అరెస్టును ఆయన అధికారిక ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.
కాగా, జనవరి 16న ఆజాద్ తీహార్ జైలు నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. జామా మసీదు వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినందుకు గాను ఆజాద్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చిన ఆజాద్.. మరోసారి జామా మసీదుకు వెళ్లి అక్కడ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తాను కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని.. జామా మసీదుకు రావడానికి ముందు గురుద్వారా, దేవాలయాలను సందర్శించినట్లు ఆ సందర్భంగా ఆజాద్ తెలిపారు.
भीम आर्मी प्रमुख चन्द्रशेखर आज़ाद जी को हैदराबाद पुलिस ने गिरफ्तार कर लिया है।
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) January 26, 2020