బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు ఊరట... ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం...
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవగా... 17 రోజులుగా ఆమె చంచల్ గూడా జైల్లోనే ఉంటున్నారు.తాజాగా న్యాయస్థానం అఖిలప్రియకు బెయిల్ ఇవ్వడం ఆమెకు కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.
Recommended Video
మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్ను మాత్రం కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్ సహా గుంటూరు శ్రీను,చంద్రహాస్, అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను విచారించిన పోలీసులు వారి నుంచి కీలక వివరాలు రాబట్టారు.
రెండు రోజుల క్రితం నిందితులు బోయ సంపత్ కుమార్,మల్లికార్జునరెడ్డిలను పోలీసులు విచారించగా... కిడ్నాప్ వ్యవహారం మొత్తం అఖిలప్రియ డైరెక్షన్లోనే సాగినట్లు వారు వెల్లడించారు. అఖిలప్రియ ఆదేశాలతోనే అన్నీ చేశాం... సిమ్ కార్డులు కొన్నాం... గుంటూరు శ్రీను స్నేహితులమంటూ విజయవాడ నుంచి వచ్చిన గ్యాంగ్కి కూకట్పల్లిలో లాడ్జి గదులు బుక్ చేశాం.' అని పోలీసులతో నిందితులు చెప్పినట్లు సమాచారం. అఖిలప్రియ ఆదేశాల మేరకే చెన్నయ్యతో కలిసి బోయినపల్లిలోని ప్రవీణ్ రావు ఇంటి వద్ద నాలుగైదు సార్లు రెక్కీ నిర్వహించినట్లు నిందితులు పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా,హఫీజ్పేట పరిధిలోని 50 ఎకరాల భూ వివాదమే ఈ కిడ్నాప్కు కారణమన్న సంగతి తెలిసిందే. సర్వే నంబర్.80లోనిఈ భూమి ప్రభుత్వ భూమి అన్న వాదన కూడా ఉంది. అలాంటప్పుడు ఇదే సర్వే నంబర్లోని భూమి క్రయ విక్రయాలు ఎలా జరిగాయి... ఈ వివాదాలు ఎలా పుట్టుకొచ్చాయన్నది అంతుచిక్కకుండా మారింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉండటంతో త్వరలోనే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది. కీలక నిందితుడు భార్గవ్ రామ్ పట్టుబడితే ఇందులో అసలు విషయాలు బయటపడవచ్చునని అంటున్నారు.