Disha Murder case:హైదరాబాద్ లో తృప్తి దేశాయ్ హల్ చల్ : కేసీఆర్ ఇల్లు ముట్టడి..అరెస్టు
హైదరాబాద్: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోనికి మహిళలకు ప్రవేశాన్ని కల్పించాలంటూ ఉద్యమిస్తోన్న భూమాత బ్రిగేడ్ చీఫ్, ప్రముఖ ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ బుధవారం ఉదయం హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు.. హల్ చల్ సృష్టించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంటిని ముట్టడించడానికి విఫల ప్రయత్నం చేశారు. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Disha murdec case: దిశ హత్యోదంతం: ఏపీలో బీ సేఫ్ యాప్..రాత్రిళ్లు తోడుగా ఎవరినైనా: మంత్రి సుచరిత
హైదరాబాద్ లో మకాం..
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతం నేపథ్యంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ దిశపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన నలుగురు కామాంధులు మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులుకు ఉరిశిక్షను విధించాలంటూ దేశవ్యాప్తంగా మహిళలు ఉద్యమిస్తోంది. ఈ పరిస్థితుల్లో తృప్తి దేశాయ్ ఏకంగా హైదరాబాద్ లో మకాం వేశారు. కేసీఆర్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు.
కేసీఆర్ ఇల్లు ముట్టడికి యత్నం..
ఈ ఉదయం తృప్తి దేశాయ్ పలువురు మహిళా సామాజిక కార్యకర్తలతో కలిసి బేగంపేట్ లో ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వారు కేసీఆర్ ఇంటి వైపు దూసుకెళ్లారు. తృప్తి దేశాయ్ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి వస్తోన్నారనే సమాచారం అప్పటికే పోలీసుల వద్ద ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
బైఠాయింపు.. నినాదాల హోరు
ముఖ్యమంత్రి నివాసం సమీపానికి వెళ్లడించిన తృప్తి దేశాయ్ సహా పలువురు సామాజిక కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. బ్యారికేడ్లను తోసుకుని తృప్తి దేశాయ్ కేసీఆర్ ఇంటి సమీపానికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డాక్టర్ దిశ కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు.
అరెస్టు చేసిన పోలీసులు..
నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీనితో వారిని అరెస్టు చేశారు. ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తృప్తి దేశాయ్ విలేకరులతో మాట్లాడారు. తన అనుచరులు, పార్టీ నాయకుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్లడానికి కేసీఆర్ కు సమయం ఉంది గానీ.. దారుణ అత్యాచానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశను కుటుంబీకులను పరామర్శించడానికి టైమ్ లేదా? అంటూ నిలదీశారు.
దొరల పాలనకు అద్దం..
డాక్టర్ దిశ హత్యోదంతంపై దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి. ముక్తకంఠంతో నినదిస్తున్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం స్పందించట్లేదని, ఇప్పటిదాకా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ ఎంత నిర్లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారో వెల్లడించడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుందని చెప్పారు. మృతురాలి కుటుంబాన్ని సైతం పరామర్శించకపోవడం, వారికి నైతిక స్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయక పోవడం దొరల పాలనకు అద్దం పడుతోందని తృప్తి దేశాయ్ ధ్వజమెత్తారు.