పవన్ తండ్రిలాంటివారు! కాంగ్రెస్లోకి బండ్ల గణేష్: టీఆర్ఎస్కు షాకిచ్చిన భూపతిరెడ్డి
Recommended Video
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోపొత్తులు, అభ్యర్ధుల ఎంపిక, పార్టీలో చేరికల వ్యవహారంపై చర్చించనున్నారు.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు, బీజేపీని ఓడిస్తారా?: కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలపై లక్ష్మణ్, మురళీధర
రాహుల్ పిలుపుతో ఢిల్లీకి
రాహుల్ పిలుపుతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దాదాపు 50మంది వరకు ఢిల్లీ తరలివెళ్లారు. ముందస్తు ఎన్నికల దృష్ట్యా... పార్టీ పరంగా వివిధ కార్యకలాపాలు నిర్వహణకు అవసరమైన నాలుగు రకాల కమిటీలతో పాటు మరో ఇద్దరు వర్కింగ్ ప్రసిడెంట్ల నియామకం కూడా జరగనుంది. టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వేగం పెంచిన కాంగ్రెస్
నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాల వేగం పెంచింది. ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలపై ఉత్తమ్ ఆరా తీసి, సీనియర్లతో కలిసి చర్చించిన తరువాత జాబితా కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను వడపోత పోసి ఏఐసీసీ అధ్యక్షుడి ఆమోదముద్ర పడితేనే అభ్యర్ధుల ప్రకటనకు మార్గం సులువు కానుంది. నియోజకవర్గాలవారీగా పరిస్థితులను గమనించిన టికెట్ల కేటాయింపు జరిపే అవకాశం ఉంది.
టీఆర్ఎస్కు షాకిచ్చిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని భూపతిరెడ్డి ఆరోపించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని భూపతి రెడ్డి చెప్పారు. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులపాలైందని ఆరోపించారు. టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఉన్నప్పటికీ తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాగా, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా రాహుల్ గాంధీ వద్ద చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరో టీఆర్ఎస్ నేత విద్యాసాగర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్లోకి బండ్ల గణేష్.. షాద్నగర్ నుంచి పోటీ?
ఇది ఇలా ఉండగా, సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీచేయనున్నట్టు తెలుస్తోంది. షాద్నగర్ నియోజకవర్గం నుంచి బండ్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, రాహుల్ గాంధీ ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి పోటీ చేస్తానని బండ్ల గణేష్ చెప్పారు.
పవన్ తండ్రిలాంటివారు..
తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని, అందుకే ఆ పార్టీలోనే చేరుతున్నట్లు తెలిపారు. తనకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి కమిట్మెంట్ అడగలేదని, సేవ చేయాలనే చేరినట్లు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాకు తండ్రి, గురువు లాంటి వారని బండ్ల గణేష్ అన్నారు. అయితే, తాన తన చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. త్యాగాలకు మారుపేరు కాంగ్రెస్ అని అన్నారు.